వైసీపీ అధినేత జగన్ వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు జగన్ ఏం చేసేందుకు అయినా వెనుకాడడం లేదు. ఇప్పటికే 8 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉంటోన్న వచ్చే ఎన్నికల్లో కూడా ఓడిపోతే మొత్తం 13 ఏళ్లపాటు ప్రతిపక్షంలోనే ఉండాల్సి ఉంటుంది. ఓ ప్రాంతీయ పార్టీ 13 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండడం అంటే చాలా కష్టమైన విషయమై. ఈ క్రమంలోనే 2019 గెలుపుకోసం ఇప్పటికే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ను రంగంలోకి దించిన జగన్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లను కూడా తన పార్టీలోకి చేర్చుకుంటున్నారు.
ఇక టీడీపీలో అసంతృప్తవాదులను సైతం వైసీపీలోకి ఆహ్వానించి వారికి ఎక్కడో ఓ చోట సీట్లు ఎరవేస్తున్నారు. ఈ ప్రయత్నాలు ఇలా జరుగుతుండగానే ఇప్పుడు వైసీపీకి సినీగ్లామర్ బాగా అద్దాలని పీకే సలహా ఇచ్చాడట. తెలుగు రాజకీయాల్లో టీడీపీకి ఉన్నంత సినీగ్లామర్ ఏ పార్టీకి లేదు. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ సినీ రంగం నుంచి రావడంతో సహజంగానే ఆ అడ్వాంటేజ్ ఈ పార్టీకి ఉంది. టీడీపీ నుంచి ఎంతోమంది సినీప్రముఖులు ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యారు.
ప్రస్తుతం కూడా ఆ పార్టీలో బాలకృష్ణ, ఎంపీ శివప్రసాద్ లాంటి వాళ్లు ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు వైసీపీకి కూడా వచ్చే ఎన్నికల్లో ఓ రేంజ్లో సినీ గ్లామర్ తీసుకురావాలని డిసైడ్ అయిన పీకే ఇప్పుడు కొందరు సినీ ప్రముఖులను పార్టీలోకి తీసుకు రావాల్సిందేనని జగన్కు సూచించాడట. ఈ క్రమంలోనే ఏపీలోని కీలక స్థానాలు అయిన విజయవాడ, గుంటూరు లోక్సభ నియోజకవర్గాలకు సినీ ప్రముఖులను దించే ప్రయత్నంలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది.
త్వరోలోనే జగన్ చేపట్టే పాదయాత్రకు ముందే అభ్యర్థులను ఇంటర్నల్గా ఖరారు చేయనున్నారు. పాదయాత్ర చేసేటప్పుడు ఆయా నియోజకవర్గాల్లోనే అభ్యర్థులను ప్రకటించనున్నారు. జగన్కు సినిమా ఇండస్ట్రీతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక సూపర్స్టార్ కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు జగన్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే విజయవాడ, గుంటూరు లోక్సభ స్థానాలకు కమ్మ సామాజికవర్గానికే చెందిన సినిమా వ్యక్తులను రంగంలోకి దించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
గుంటూరు లోక్సభ సీటుకు ఆదిశేషగిరిరావు పేరు పరిశీలనలో ఉంది. ఇక విజయవాడ సీటు కోసం నందమూరి ఫ్యామిలీకి చెందిన కీలక వ్యక్తిపై కన్నేసిన జగన్ ఆయన్ను పార్టీలోకి తీసుకువచ్చే బాధ్యతను గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి అప్పగించారని తెలుస్తోంది. జనసేన, టీడీపీ సినీగ్లామర్తో ఉన్నప్పుడు వైసీపీకి కూడా కొంత సినీ గ్లామర్ అద్దాలని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సలహాతో జగన్ సినిమా వ్యక్తులను టార్గెట్గా చేసుకున్నారు.
ఆదిశేషగిరి రావు ఎంపీగా పోటీ చేస్తే మహేష్ ఫ్యాన్స్ ఇన్ డైరెక్టుగా అయినా ఆయనకు సపోర్ట్ చేస్తారు. మహేష్, కృష్ణ సాయం కూడా ఆయనకు ఉండొచ్చు. ఇక నందమూరి ఫ్యామిలీకి చెందిన వ్యక్తి విజయవాడ నుంచి రంగంలోకి దిగితే ఎన్టీఆర్ అభిమానులతో పాటు నందమూరి అభిమానుల ఓట్లు కూడా గ్యారెంటీగా చీలతాయన్నదే జగన్, పీకే ప్లాన్. మరి జగన్, పీకే ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో ? చూడాలి.