భూమా నాగిరెడ్డి హఠాన్మరణంతో రాయలసీమలోని కర్నూలు జిల్లా కేంద్రం నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే, రాష్ట్రంలో ఎక్కడైనా సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయితే.. ఆ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో పోటీ లేకుండానే ఏకగ్రీవంగా ఎన్నిక జరిగేందుకు రాజకీయ పార్టీలు సహకరించుకునేవి. అయితే, నంద్యాలలో మాత్రం పరిస్థితి రివర్స్ అయింది. ప్రస్తుతం నాగిరెడ్డి, ఆయన కూతురు అఖిల ప్రియ రెడ్డిలు చంద్రబాబు పార్టీ టీడీపీలో ఉన్నారు. టీడీపీ నేతగా ఉన్న సమయంలోనే భూమా మృతి చెందాడు. కాబట్టి నంద్యాల స్తానం తమదేనని టీడీపీ చెబుతోంది. ఇక్కడ పోటీ లేకుండా చూడాలని కూడా అన్ని పార్టీలనూ అభ్యర్థించింది. ముఖ్యంగా వైసీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు రహస్యంగా సందేశం కూడా పంపారు.
అయితే, ఈ ప్రతిపాదనకు వైసీపీ ససేమిరా అంది. 2014లో భూమా నాగిరెడ్డి తమ పార్టీ అభ్యర్థిగా వైసీపీ తరఫున నంద్యాలలో పోటీ చేశారని, ఆయనకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి చంద్రబాబు లోబరుచుకున్నాడని, చివరికి మంత్రి పదవి కూడా ఇవ్వకపోవడంతో ఆయన దిగులు పెట్టుకుని మరణించారని వైసీపీ నేతలు అంటున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ తరఫున భూమా కుటుంబానికి చెందిన బ్రహ్మానంద రెడ్డి, వైసీపీ తరఫున ఈ జిల్లాలో మంచి పట్టుకున్న శిల్పా బ్రదర్స్లో ఒకరిని రంగంలోకి దింపారు. ఇప్పుడు పోటీ రసవత్తరంగా మారింది. దీంతో చంద్రబాబు ఏకంగా ఏడు నుంచి ఎనిమిది మంత్రి మంత్రులను రంగంలోకి దింపారు.
అభివృద్ధి పనుల పేరుతో ఆయనే స్వయంగా నంద్యాలలో పర్యటిస్తూ.. ప్రజలను తన వైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క, వైసీపీ కూడా భారీస్థాయిలో ప్రచారం చేస్తోంది. రేపోమాపో జగన్ నేరుగా ఇక్కడ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. ఇక, ఇటీవల ఈ నియోజకవర్గంలో నిర్వహించిన సర్వేలో జగన్ పార్టీ గెలుపు ఖాయమని తేలినట్టు ఆ పార్టీ ప్రచారం చేసుకుంటోంది. అయితే, నిజానికి ఈ నియోజకర్గంలో ప్రజలు ఇప్పటికీ జగన్ పట్ల సానుభూతితో ఉండడం గమనార్హం. ఇదిలావుంటే, తాజాగా ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం తక్షణమే కోడ్ అమల్లోకి వచ్చినట్టయింది. ఇక, ఈ ఉప పోరులో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.
ఉప ఎన్నిక షెడ్యూల్ ఇలా ఉంది..
- జూలై 29 ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల
- నామినేషన్ల దాఖలకు చివరి తేదీ ఆగస్టు 5
- నామినేషన్ల పరిశీలనకు గడువు వచ్చే నెల 7
- నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఆగస్టు 9
- పోలింగ్ ఆగస్టు 23
- ఓట్ల లెక్కింపు ఆగస్టు 28
- ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలతో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.