రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శతృవులు ఉండరనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఓ పార్టీలో ఉన్నవాళ్లు రేపు మరో పార్టీలో చేరి మిత్రులుగా మారిపోతున్న కాలమిది. పూటకోపార్టీ మారిన నేతలు కూడా ఉన్నారు. వీళ్లందరి లక్ష్యం ఒక్కటే.. అదే అధికారం.! అవును అధికారంకోసం పార్టీలు మారడం, సిద్ధాంతాలను వదిలేయడం.. వ్యక్తిత్వాలను ఫణంగా పెట్టడం.. మనం ఎంతోమందిలో చూశాం. ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్, దగ్గుబాటి వెంకటేశ్వరరావు కలయిక.. పలు అనుమానాలకు, ఆలోచనలకు కారణమవుతోంది. అయితే వీళ్లద్దరి భేటీ ఇప్పుడు బీజేపీ మహిళామోర్చా నేత దగ్గుబాటి పురంధేశ్వరికి చిక్కులు తెచ్చిపెడుతోంది.
దగ్గుబాటి వెంకటేశ్వరరావు దివంగత నేత, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ అల్లుడనే విషయం తెలిసిందే. తెలుగుదేశంలో క్రియాశీలంగా వ్యవహరించిన వ్యక్తి ఆయన. ఎన్టీఆర్ ను పదవీచ్యుతిడిని చేసే సమయంలో తోడల్లుడు చంద్రబాబుకు మద్దతుగా నిలిచి, ఎన్టీఆర్ భార్య లక్ష్మిపార్వతికి వ్యతిరేకంగా పోరాడారు. ఆ తర్వాతికాలంలో ఎన్టీఆర్ కుటుంబంలో ఎన్నో చీలికలు, పీలికలు ఏర్పడ్డాయి. ఆ సమయంలో చంద్రబాబుతో వ్యతిరేకించిన దగ్గుబాటి కుటుంబం కాంగ్రెస్ పార్టీలో చేరిపోయింది. రాష్ట్ర విభజన తర్వాత బీజేపీలో చేరింది.
ఉండవల్లి అరుణ్ కుమార్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేతగా సుపరిచితులు. మేధోవర్గానికి చెందిన నేతగా గుర్తింపు పొందారు. ఎలాంటి అంశంపైనానా లోతుగా మాట్లాడగల నేర్పరి. అందుకే ఎంపీగా ఎన్నో ఏళ్లపాటు రాణించారు. కాంగ్రెస్ పార్టీలో ఆయనకు సమున్నత స్థానం దక్కింది. వై.ఎస్.కు వీరవిధేయుడిగా పేరొందారు. ఉండవల్లి ద్వారానే రామోజీరావుపై వై.ఎస్. యుద్ధం ప్రారంభించారు. రామోజీరావును నడివీధిలో నిలబెట్టడంలో ఉండవల్లి సక్సెస్ అయ్యారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆ పార్టీకి రాజీనామా చేశారు. నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జైసమైక్యాంధ్ర పార్టీలో చేరి రాజమండ్రి నుంచి బరిలోకి దిగారు. ఓడిపోయిన తర్వాత ఏ పార్టీతోనూ సంబంధం లేకుండా ఉండిపోయారు.
ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్, దగ్గుబాటి వెంకటేశ్వర రావు ఒకే వేదికను పంచుకోవడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇదేం కలయిక అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో వీళ్లిద్దరూ కలిసి పనిచేసినా.. దగ్గుబాటి వెంకటేశ్వరరావు సతీమణి, ఎన్టీఆర్ కుమార్తె పురంధరేశ్వరి ప్రస్తుతం బీజేపీలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆమె రాజంపేట నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. జాతీయ మహిళా మోర్ఛా అధ్యక్షురాలిగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. అలాంటి పురంధేశ్వరి భర్త ఉండవల్లితో కలవడం సహజంగానే బీజేపీ శ్రేణుల్లో ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించింది.
ఉండవల్లి అరుణ్ కుమార్ వచ్చే ఎన్నికల నాటికి వైసీపీలో చేరడం ఖాయమని ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో దగ్గుబాటి ఆయన్ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. దగ్గుబాటి కుటుంబం కూడా జగన్ పంచన చేరుతుందేమోనని తాజా పరిణామాలు అనుమానాలు కలిగిస్తున్నాయి. టీడీపీతో కలిసి ఉన్నంతవరకూ బీజేపీలో పురంధేశ్వరికి పెద్ద ప్రాధాన్యం దక్కకపోవచ్చని ఆ పార్టీ శ్రేణుల మాట. అందుకే బీజేపీకు గుడ్ బై చెప్పేసి వైసీపీలో చేరేందుకు పురంధేశ్వరి ప్లాన్ వేసారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. అంతకుముందే బీజేపీలో పురంధేశ్వరి సీటుకు ఎర్త్ పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం.