నంద్యాల ఉప ఎన్నికలు కురుక్షేత్రాన్ని తలపిస్తున్నాయి. ప్రచారాలు, విమర్శలు, ప్రతివిమర్శలు.. ఇలా ప్రచారం తారస్థాయికి చేరింది. 2019 ఎన్నికల్లో ఈ ఎన్నికల ఫలితం ఓటర్లపై ఉంటుందని టీడీపీ, వైసీపీ గట్టిగా నమ్ముతు న్నాయి. అందుకే గెలుపు కోసం అహర్నిశలు పనిచేస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నికల్లో గెలవాలని సీఎం చంద్రబాబు.. పట్టుదలతో ఉన్నారు. అయితే ఇప్పుడు టీడీపీ నేతలను ఆ వియ్యంకులు టెన్షన్ పెడుతున్నారట. వీరి ప్రభావం ఎన్నికలపై పడుతుందని ఆందోళన చెందుతున్నారట. ఇదే సమయంలో వైసీపీ కూడా దీనిని వీలైనంతగా క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. మరి ఆ వియ్యంకులెరవరంటే.. ఆదినారాయణ, కేశవరెడ్డి!!
ఈ రెండు పేర్లు వింటే టీడీపీ నేతల గుండెలు గుబేలుమంటున్నాయి. నంద్యాల ప్రచారంలో విపరీతంగా ప్రచారం చేస్తున్నా.. వీరి పేర్లు మాత్రం తీవ్రంగా ప్రభావితం చేస్తాయని కంగారు పడుతున్నారు. ఎన్ని పాజిటివ్ అంశాలతో బరిలోకి దిగినా.. చివరికి ఓటర్లు వీరి పేర్లు తీసుకొస్తుండటంతో ఏం చెప్పాలో తెలియక సందిగ్థంలో పడిపోతున్నారు మంత్రులు, నాయకులు! ఆదినారాయణ,కేశవరెడ్డి పేర్లు టీడీపీకి మైనస్గా మారే అవకాశం ఉందని నేతలు చెబుతున్నారట. నంద్యాలలో కేశవరెడ్డి ఎఫెక్ట్ ఏ మాత్రం పనిచేస్తుంది? నంద్యాల ఉప ఎన్నిక జరుగుతున్న సమయంలో ఇది హాట్ టాపిక్ గా మారింది.
కేశవరెడ్డి విద్యాసంస్థల ఛైర్మన్ కేశవరెడ్డి విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద నుంచి భారీగా డిపాజిట్లు వసూలు చేసి చేతులెత్తేశారు. కేశవ రెడ్డి చేతిలో మోసపోయిన వారు ఎక్కువ మంది నంద్యాల నియోజకవర్గంలోనే ఉన్నారు. బోర్డు తిప్పేయడంతో ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం ఈకేసును సీఐడీకి అప్పగించినా తమకు రావాల్సిన సొమ్ము తిరిగి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు.
కేశవరెడ్డి మంత్రి ఆదినారాయణరెడ్డికి స్వయానా వియ్యంకుడు కావడంతో టీడీపీకి ఇది కొంత ఇబ్బందిగా మారింది. నంద్యాల ఉప ఎన్నికలో ప్రచారానికి వెళ్లిన మంత్రులకు, నేతలకు ఎక్కువగా కేశవరెడ్డి బాధితులే ఎదురవుతున్నారు. సీఐడీ విచారణ పూర్తయిన వెంటనే డబ్బులు తిరిగి ఇచ్చేలా ఏర్పాటు చేస్తామని నేతలు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లారు. కేశవరెడ్డి బాధిత కుటుంబాలతో తాజాగా వైసీపీ నేతలు సమావేశమయ్యారు.
కేశవరెడ్డి చేసిన మోసాన్ని మంత్రి ఆదినారాయణరెడ్డి కాపాడుతున్నారని, అగ్రిగోల్డ్ మాదిరిగానే ప్రభుత్వం ఈకేసును కూడా నీరుగార్చే అవకాశముందని వైసీపీ నేతలు బాధితులకు చెబుతున్నారు. రెండురోజుల క్రితం కేశవరెడ్డి బాధితులు నంద్యాలలో ఆందోళనకు కూడా దిగడంతో టీడీపీని కలవరపెడుతోంది. అందుకే మంత్రి ఆదినారాయణరెడ్డిని పల్లె ప్రాంతాలకు ప్రచారానికి పంపుతున్నారట చంద్రబాబు!!