నంద్యాలలో టీడీపీని క్రాస్ ఓటింగ్ భయపెడుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ.. ప్రతి ఒక్కరిలో ఈ టెన్షన్ ఎక్కువగా కనిపిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో పోలైన ఓట్లు, ఓట్ల శాతం.. గుర్తుచేసుకుంటే ఇది మరింత అధికమవుతోంది. నంద్యాలలో భూమా నాగిరెడ్డిపై తీవ్ర వ్యతిరేకత ఉందని తేలడంతో టీడీపీ నాయకులకు చెమటలు పడుతున్నాయి. ఇలానే జరిగితే సెంటిమెంట్నే నమ్ముకున్న టీడీపీకి.. మరింత నష్టం కలుగుతుందని వాపోతున్నారు. సామాజికవర్గాల ప్రకారం టీడీపీ లెక్కలేసుకుంటున్నా.. గత ఎన్నికల్లో ఓట్ల లెక్కలు మాత్రం ఊహించని విధంగా ఉన్నాయని.. నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే.. ఇక ఎంత శ్రమించినా ఫలితం దక్కదని చెబుతున్నారు.
సానుభూతినే నమ్ముకుని నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ బరిలోకి దిగింది. అందుకే అఖిలప్రియను ముందుంచి ప్రచారం చేయిస్తున్నారు. డెవలప్ మెంట్ నినాదం, సానుభూతి సంగతి ఎలా ఉన్నా.. నంద్యాల ప్రజల ఆటిట్యూడ్ భూమా కుటుంబాన్ని ఎన్నికల్లో ఓడిస్తుందేమో అనే అభిప్రాయం కలగకమానదు. గత ఎన్నికల ఓట్ల లెక్కలను గమ నిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. భూమా ఏదైనా ఒక పార్టీలో ఉంటే.. ఆ పార్టీ పట్ల సానుకూలత ఉన్నా, భూమా పట్ల సానుకూలత ఉండదేమో అనే అభిప్రాయం కలుగుతోంది.
అందుకు సాక్ష్యం మొన్నటి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు. మొన్నటి ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఆ సమయంలో కర్నూలు ఎంపీ సీటుతో పాటు నంద్యాల ఎంపీ సీటును, నంద్యాల ఎమ్మెల్యే సీటును వైఎస్సార్ కాంగ్రెస్ సొంతం చేసుకుంది. అప్పుడు పోల్ అయిన ఓట్ల లెక్కలను చూస్తే.. భూమా పట్ల జనాల వైఖరి ఎలా ఉందో అర్థమవుతుంది. నంద్యాల ఎంపీ సీటులో భాగం నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం.
మరి ఇక్కడ నుంచి వైకాపా అభ్యర్థి భూమా నాగిరెడ్డి తన సమీప అభ్యర్థి, ప్రధాన ప్రత్యర్థి శిల్పా మోహన్ రెడ్డి మీద సాధించిన మెజారిటీ 3,604. మరి నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కి నంద్యాల సెగ్మెంట్లో వచ్చిన మెజారిటీ 16,000 కు పైనే! భూమా పోటీ చేసిందీ వైకాపా తరఫునే, ఎస్పీవై పోటీ చేసింది ఒకే వైకాపా తరపునే. కానీ మొన్నటి ఎన్నికల్లోనే బీభత్సమైన క్రాస్ ఓటింగ్ జరిగింది. ఈ లెక్కన నంద్యాల ప్రజలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఎస్పీవై.రెడ్డితో పాటు అప్పుడు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన శిల్పా మోహన్రెడ్డిని అభిమానించినట్టు స్పష్టమైంది.
ఒకవైపు శోభానాగిరెడ్డి మరణించిందనే సానుభూతి ఉన్నప్పటికీ భూమా నాగిరెడ్డికి ఓటు వేయడానికి చాలా మందికి మనసొప్పలేదు. ఎంపీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే వేసినా, ఎమ్మెల్యేగా మాత్రం వైసీపీకి ఓటు వేయలేదు. ఎమ్మెల్యేగా వారి ఎంపిక శిల్పా మోహన్ రెడ్డి వైపే నిలిచింది. క్రాస్ ఓటింగ్ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది.అప్పుడూ సానుభూతి ఉన్నా, వ్యతిరేకత తేటతెల్లం అయ్యింది. మరి ఇప్పుడేం జరుగుతుందో వేచి చూడాల్సిందే!