నంద్యాల ఉప ఎన్నిక సీఎం చంద్రబాబు, మంత్రులకు అగ్నిపరీక్షలా మారింది. నిత్యం సమావేశాలతో సతమతమవు తున్న ఆయన.. ఈ ఎన్నిక కోసం ప్రత్యేకంగా గంట సేపు కేటాయించి పరిస్థితి అంచనావేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన తీవ్ర ఒత్తిడికి కూడా గురవుతున్నారని తెలుస్తోంది. వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్రెడ్డి గట్టి పోటీ ఇస్తుండటంతో ఇప్పుడు చంద్రబాబులో టెన్షన్ ఎక్కువవుతోందట. శిల్పా మోహనరెడ్డి వైసీపీలో చేరేవరకూ.. అక్కడ వైసీపీ తరఫున ఎవరు పోటీచేస్తారో తెలియని పరిస్థితి. కానీ చంద్రబాబు తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం.. ఇప్పుడు అందరినీ ముప్పు తిప్పులు పెడుతోంది. శిల్పాను వదులుకుని తప్పుచేశానని ఇప్పుడు ఆయన లోలోన అంతర్మథన పడుతున్నారట.
నంద్యాల ఉప ఎన్నికల్లో విజయం కోసం టీడీపీ, వైసీపీ శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుని బరిలో పోరాడుతోంది. 25 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు.. ఇలా అంతా నంద్యాలలోనే తిష్టవేశారు. టీడీపీ అభ్యర్థి రాజకీయాలకు కొత్త కావడంతో పార్టీని గెలిపించే బాధ్యత అంతా.. వీరిపైనే పడింది. ఇక చంద్రబాబు కూడా ఈ ఎన్నికలను సీరియస్గానే తీసుకున్నారు. దీంతో వీరిపై ఒత్తిడి మరింత అధికమవుతోందట. అయితే మరోపక్క టీడీపీ టికెట్ ఆశించి..భంగపడి వైసీపీలో చేరి ఆ పార్టీ నుంచి పోటీచేస్తున్న శిల్పా గట్టిపోటీ ఇవ్వడం కూడా ఇప్పుడు ఆందోళనకు గురిచేస్తోంది.
జగన్ కొద్ది రోజులుగా నంద్యాలలోనే మకాం వేయడం, వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి గట్టి పోటీ ఇస్తుండటంతో టీడీపీ నేతలకు కంటిమీద కునుకులేదు. సెమీఫైనల్స్ గా భావించడంతో పాటు వచ్చే ఎన్నికలకు ఇది రెఫరెండంగా అనుకుంటున్న టీడీపీ నేతలకు నంద్యాల ఉప ఎన్నిక సవాల్ గా మారింది. వందల కోట్ల అభివృద్ధి పనులు చేపట్టినా, సానుభూతి పవనాలు వీస్తున్నాయని పైకి చెబుతున్నా లోలోపల మాత్రం టెన్షన్ పడిపోతున్నారు.
నంద్యాలతో సన్నిహిత సంబంధాలున్న శిల్పా టీడీపీ నుంచే వైసీపీకి వెళ్లారు. నంద్యాల ఉపఎన్నికకు బాధ్యులుగా నియమించిన మంత్రులు కూడా ఇదే అంశాన్ని చర్చించుకుంటున్నారట. శిల్పాను పార్టీ వీడకుండా చూసి ఉంటే వైసీపీకి బలమైన అభ్యర్థి దొరికి ఉండేవారు కాదన్నది వారి వాదన. భూమా నాగిరెడ్డి మరణంతో ఏర్పడిన ఈ ఎన్నికలో శిల్పామోహన్ రెడ్డికే టీడీపీ టిక్కెట్ ఖరారు చేసి ఉంటే ఇంత ఒత్తిడి ఉండేది కాదంటున్నారు.
అఖిలప్రియకు మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి శిల్పాకు టిక్కెట్ ఇస్తే సరిపోయేది అంటు న్నారు. చంద్రబాబు ఈ విషయంలో రాంగ్ స్టెప్ వేశారని కూడా ఒక సీనియర్ మంత్రి వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. నంద్యాలలో సులువుగా గెలిచే అవకాశాన్ని చంద్రబాబు చేజార్చుకున్నారని మంత్రులు అభిప్రాయపడు తు న్నారట. ఈ విషయం తెలిసిన చంద్రబాబు కూడా.. ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట.