ఏపీలో కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక చుట్టూనే ఇప్పుడు ఏపీ రాజకీయాలన్ని నడుస్తున్నాయి. ఓ వైపు కాకినాడ కార్పొరేషన్కు కూడా ఎన్నికలు జరుగుతున్నా అందరి దృష్టి నంద్యాల మీదే ఉంది. నంద్యాల ఉప ఎన్నిక 2019 ఎన్నికలకు సెమీఫైనల్స్ లాంటిదన్న చర్చతో రెండు పార్టీల అధినేతలు అయిన సీఎం చంద్రబాబు, అటు వైసీపీ అధినేత జగన్ ఇద్దరూ అక్కడ గెలుపుకోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు.
జగన్ అయితే అక్కడ ఏకంగా 15 రోజులు మకా వేశాడంటే ఆ ఎన్నికను ఎంత ఛాలెంజింగ్గా తీసుకున్నాడో అర్థమవుతోంది. ఈ ఎన్నికలపైనే హాట్ హాట్ చర్చ జరుగుతోన్న వేళ అధికార టీడీపీకి దిమ్మతిరిగే షాక్ తగలనుందన్న మరో వార్త ఇప్పుడు ఏపీ రాజధానిలో సెగలు రేపుతోంది. అధికార టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే, మాజీ మంత్రి విపక్ష వైసీపీలోకి జంప్ చేస్తున్నారన్నదే ఆ వార్త సారాంశం.
టీడీపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ నేపథ్యంలో ఏకంగా 21 మంది ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కేశారు. కొద్ది రోజుల క్రితం టీడీపీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి తన పదవికి గుడ్ బై చెప్పి మరీ వైసీపీలోకి వెళ్లిపోయారు. ఇక ఇప్పుడు గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి రావెల కిషోర్బాబు వైసీపీలోకి జంప్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు అమరావతి సర్కిల్స్లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
గత ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రావెలకు బాబు కేబినెట్లో అనూహ్యంగా మంత్రి పదవి వచ్చింది. ఆయనపై తీవ్ర ఆరోపణలు రావడం, ఆయన ఇద్దరు కుమారుల తీరుతో విసిగిపోయిన చంద్రబాబు ఆయన్ను మంత్రి పదవి నుంచి తప్పించారు. అప్పటి నుంచి ఆయన తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. మందకృష్ణ మాదిగ ఉద్యమానికి అనుకూలంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించడం, బీఎస్పీ అధినేత్రి మాయావతిని కలిసిరావడం లాంటి విషయాలపై చంద్రబాబుకు రిపోర్ట్ వెళ్లింది.
ఇక వచ్చే ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ ఇవ్వకూడదని బాబు డెసిషన్ తీసుకున్నారని కూడా వార్తలు వచ్చేశాయి. ఈ విషయం తెలుసుకున్న రావెల ఇప్పటికిప్పుడు వైసీపీలోకి జంప్ చేసేయాలని ప్లాన్ చేసుకున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ఆయన ఒంగోలు ఎంపీ వైవి.సుబ్బారెడ్డితో పాటు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డితో రహస్య చర్చలు కూడా జరిపినట్టు తెలుస్తోంది.