ప్రస్తుతం నంద్యాల నియోజకవర్గానికి జరుగుతోన్న ఉప ఎన్నికలు కర్నూలు జిల్లా రాజకీయాల్లో పెను మార్పులకు కారణమవుతున్నాయా ? అంటే అవునన్న ఆన్సరే వినిపిస్తోంది. ఈ ఉప ఎన్నికను కేవలం ఈ కోణంలో మాత్రమే చంద్రబాబు చూడడం లేదని అర్థమవుతోంది. 2019 ఎన్నికల నేపథ్యంలో బాబు అనేక రకాల స్కెచ్లను ఈ ఉప ఎన్నిక వేళే గీస్తున్నట్టు తాజా రాజకీయ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
ఈ ఎన్నికలను పక్కనబెడితే….2019 ఎన్నికలను భూమా ఫ్యామిలీ ధీటుగా ఎదుర్కొనలేదనే అభిప్రాయానికి టీడీపీ అధినేత వచ్చినట్లుంది. భూమా నాగిరెడ్డి సత్తా వేరు. ఆయన అటు ఆళ్లగడ్డతో పాటు ఇటు నంద్యాల..ఇంకా చెప్పాలంటే సగం కర్నూలు జిల్లా నియోజకవర్గాలను ఆయనే శాసించారు. అటు కర్నూలులోను ఆయన బావమరిదే ఎమ్మెల్యే. ఇక ఇప్పుడు ఉప ఎన్నికల్లో బ్రహ్మానందరెడ్డిని గెలిపించుకునేందుకు ఎన్నోపాట్లు పడాల్సి వస్తోంది.
ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే ఎన్నికల్లో నంద్యాల, ఆళ్లగడ్డ రెండు సీట్లు భూమా ఫ్యామిలీకి ఇవ్వకూడదన్న డెసిషన్కు బాబు వచ్చేసినట్టే కనపడుతోంది. ఇక మంత్రిగా ఉన్న అఖిలప్రియకు దాదాపు ఎర్త్ పెట్టేసినట్టే తాజా పరిణామాలు చెపుతున్నాయి. ఈ ప్లాన్లో భాగంగానే నంద్యాల మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డికి రెడ్ కార్పెట్ వేసి మరీ టీడీపీలోకి స్వాగతం పలికారు.
నంద్యాలలో భూమా ఫ్యామిలీకి ప్రత్యామ్నాయం కోసం చంద్రబాబు చూస్తున్నట్లు కన్పిస్తోంది. భూమా ఫ్యామిలీని ఆళ్లగడ్డకే పరిమితం చయాలన్న నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే 2019 ఎన్నికల్లో ఆళ్లగడ్డ సీటును బ్రహ్మానందరెడ్డికి ఇచ్చి అఖిలను పక్కకు తప్పించనున్నారు. ఇక నంద్యాల సీటును ఏవి.సుబ్బారెడ్డికి, ఎంపీ సీటును గంగుల ప్రతాప్రెడ్డికి ఇచ్చేలా బాబు స్కెచ్ గీసినట్టు తెలుస్తోంది.
2019 ఎన్నికలను ఎదుర్కొనే సత్తా ఈ అన్నా చెల్లెళ్లకు లేదన్న విషయాన్ని అర్థం చేసుకున్న చంద్రబాబు నంద్యాల నియోజకవర్గంలో పట్టున్న గంగుల కుటుంబాన్ని దరిచేర్చుకున్నారు. ఇక్కడ భూమాకు పట్టున్నా ఇప్పుడు ఆయన లేకపోవడంతో పరిస్థితులు మారిపోయాయి. ఈ క్రమంలోనే భూమా ఫ్యామిలీని ఆళ్లగడ్డకు పరిమితం చేసి వచ్చే ఎన్నికల్లో నంద్యాలలో గంగుల ప్రతాప్రెడ్డిని రంగంలోకి దించనున్నారు. ఒక వేళ గంగులకు ఎంపీ సీటు ఇస్తే, ఇక్కడ పట్టున్న ఏవి.సుబ్బారెడ్డికి ఎమ్మెల్యే సీటు ఇవ్వనున్నారు. మొత్తానికి అయితే అఖిలప్రియ కెరీర్కు దాదాపు శుభం కార్డు పడినట్టే.