టీడీపీ నేతల ఆశలన్నీ నీరుగారిపోయాయి. నంద్యాలలో తటస్థంగా ఉంటామని ప్రకటించి టీడీపీకి పెద్ద షాకే ఇచ్చాడు జనసేనాని పవన్ కల్యాణ్!! నంద్యాల ఉప ఎన్నికల్లో పవన్ మద్దతు ఉంటుందని.. కాపు, బలిజ ఓట్లు తమకే అని టీడీపీ అధినేత చంద్రబాబు కూడా భావించారు. కానీ పవన్ అనూహ్య నిర్ణయంతో అవాక్కయ్యారు. అయితే పవన్ నిర్ణయం వెనుక చాలా కథే జరిగిందని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. పవన్-బాబు బంధానికి బీజేపీ బ్రేకులేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ను తమ వైపు తిప్పుకొనేందుకు రకరకాలుగా బీజేపీ వ్యూహాలు పన్నుతోందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
పవన్-చంద్రబాబు మధ్య స్నేహం ఎంత బలమైందో అందరికీ తెలిసిన విషయమే! ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వకుండా మోసగించిన బీజేపీని.. సందర్భం దొరికినప్పుడల్లా ఏకేస్తూనే ఉన్నారు. చంద్రబాబు ఎప్పుడు ఆపదలో ఉన్నా.. ఆయన్ను కాపాడేందుకు నేనున్నా అంటూ ముందుకొస్తుంటారు. చాలా విషయాల్లో చంద్రబాబును ఒడ్డున పడేశారు.
అయితే ఇదే సమయంలో ఏపీలో సొంతంగా ఎదిగేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. పవన్ను తమ వైపు లాక్కునేందుకు ప్రణాళికలు కూడా వేసుకుంటోంది. చంద్రబాబుకు ఎలాగైనా చెక్ చెప్పాలని సమయం కోసం ఎదురుచూస్తోంది. ప్రస్తుతం నంద్యాల ఉప ఎన్నిక అందుకు సరైనది భావిస్తోంది. టీడీపీ-జనసేన మధ్య గ్యాప్ రావడానికి కారణం.. ఇరు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ నిర్వహించిన ఎట్హోమ్. ఇందులో నరసింహన్-పవన్ భేటీతోనే మొత్తం సీన్ రివర్స్ అయిపోయిందని సమాచారం!!
ఈ భేటీలో ఏపీ రాజకీయాలపై వీరిద్దరూ చర్చించుకున్నారట. ఈ సమయంలోనే పవన్కు కేంద్ర పెద్దల అభిమతాన్ని పవన్కు నరసింహన్ వివరించారట. ప్రస్తుతం ఏపీలో బీజేపీ-టీడీపీ మధ్య దూరం పెరుగుతోంది. సీఎం చంద్రబాబుకు సన్నిహితంగా ఉంటున్న వారందరినీ కేంద్రం దూరం చేస్తోంది. అలాగే కొత్త మిత్రులను వెతుక్కుంటోంది. ఇటీవల వైసీపీతోనూ దోస్తీ బలపడుతోంది. ఈ నేపథ్యంలోనే 2019 ఎన్నికల సమయానికి ఇటు టీడీపీకి గుబ్బై చెప్పి.. వైసీపీతో ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పవన్కు వివరించారట.
ఇదే సమయంలో బీజేపీ-వైసీపీకి తోడు జనసేన కూడా కలిస్తే బాగుంటుందని బీజేపీ పెద్దలు అభిప్రాయపడుతున్నారని పవన్కు తెలిపారని సమాచారం. ఇదే సమయంలో నంద్యాల ఉప ఎన్నికల్లో తటస్థంగా ఉండాలని పవన్ను నరసింహన్ కోరారని టీడీపీ నేతలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. నంద్యాలలో గణనీయంగా ఉన్న కాపు, బలిజ ఓట్లు టీడీపీకి రాకుండా చేయటమే దీని ఉద్దేశమని వారు అభిప్రాయపడుతున్నారు.
అనంతరం పవన్ తన నిర్ణయం ప్రకటించడంతో ఒక్కసారిగా టీడీపీ నేతలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. అయితే దీనిని కొట్టిపారేస్తున్న వారు కూడా లేకపోలేదు. హోదా ఇవ్వనందుకు పవన్.. బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారని, అలాంటప్పుడు బీజేపీ నేతలతో ఎందుకు కలుస్తారని కొందరు టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇక నంద్యాల ఉప ఎన్నికల్లో పవన్ మద్దతు ఇవ్వకపోవడమే మంచిదనే వాళ్లు లేకపోలేదు. ఒకవేళ గెలిస్తే.. తమ వల్లే గెలిచారనే ప్రచారం ఎక్కువవుతుందని వివరిస్తున్నారు. మొత్తానికి బీజేపీ నేతల మంత్రం ఫలించిందనే చెప్పాలి!!