సామాజిక సమీకరణలు ఒక్కొక్కప్పుడు బాగానే ఉన్నా.. ఒక్కొక్కసారి ఉన్నట్టుండి వేటేస్తాయి. అదే ఇప్పుడు ప్రభుత్వంలో నెంటర్ 2 లేదా 3గా కొనసాగుతున్న కీలకమైన నేత హోం మంత్రి చిన్నరాజప్ప కొంప ముంచింది. తీవ్ర అవమానం పాలయ్యేలా చేసింది. వివరాల్లోకి వెళ్తే.. సుదీర్ఘ విరామం తర్వాత కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలకు తెరలేచింది. ఈ కార్పొరేషన్లోని మొత్తం 50 డివిజన్లలోని 48 స్థానాల ఎన్నికలకు నగారా మోగింది. వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రబాబు.. ఎలాగైనా గెలవాలని డిసైడ్ అయ్యారు.
దీంతో అదే జిల్లాకు చెందిన సీనియర్ నేత చిన్నరాజప్పకు ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. అదేవిధంగా మంత్రులు యనమల రామకృష్ణుడు, కళావెంకట్రావులకు కూడా బాధ్యతలు అప్పగించారు. దీంతో నాలుగు రోజుల కిందట వీరంతా అక్కడ టీడీపీ కార్పొరేటర్ల టిక్కెట్లు కేటాయించారు. ఈ క్రమంలోనే కాపు సామాజిక వర్గానికి పెద్ద ఎత్తున పీట వేశారు. కాపు ఉద్యమం హోరెత్తుతుండడంతో వారికి పెద్ద పీట వేసి ఉంటారని అందరూ భావించారు. అయితే, అదేసమయంలో చంద్రబాబు వర్గానికి చెందిన కమ్మనేతను ఒక్కరినీ ఎంపిక చేయకపోవడం చర్చకు దారితీసింది.
విపక్ష వైసీపీ కూడా కమ్మ సామాజికవర్గానికి చెందిన వారికి ఒకటి రెండు కార్పొరేటర్ సీట్లు ఇచ్చినా టీడీపీకి వెన్నుదన్నుగా ఉండే కమ్మ సామాజికవర్గానికి చెందిన ఒక్కరికి కూడా టీడీపీ కార్పొరేటర్ సీటు ఇవ్వలేదు. అక్కడితే ఆగకుండా చినరాజప్ప కమ్మ కులాన్ని ఉద్దేశించి తీవ్రంగా చేసిన వ్యాఖ్యలు అక్కడ ఆ సామాజికవర్గ పెద్దల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమయ్యాయి. దీంతో వెంటనే వాళ్లు చంద్రబాబుకు ఈ విషయం చేరవేశారు.
కాకినాడలో చంద్రబాబు సామాజిక వర్గం ఓటర్లు తక్కువగా ఉండటంతో ఆ వర్గానికి సీటు ఇవ్వాల్సిన అవసరం లేదని మంత్రులు ఐక్యంగా నిర్ణయం తీసుకున్నారని సమాచారం. దీనిపైనా చంద్రబాబు పెద్దగా ఆగ్రహించింది లేదట. అయితే, సీఎం సామాజిక వర్గానికి చెందిన పెద్దలంతా మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. ఇక, ఈ క్రమంలోనే జరిగిన చర్చల్లో చినరాజప్ప సీఎం సామాజిక వర్గానికి వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. దీంతో కమ్మ వర్గం పెద్దలు రెబల్స్కు సపోర్ట్ చేసి టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థులను ఓడించాలని డిసైడ్ అయ్యారట.
దీంతో పరిస్థితి ముదురుతోందని, చినరాజప్ప అక్కడే ఉంటే పార్టీకి మరింత నష్టం వాటిల్లడం ఖాయమని గుర్తించిన చంద్రబాబు ఉన్నపళాన ఆయనను అమరావతికి రప్పించేశారని తెలిసింది. అంతేకాదు, కాకినాడ కార్పొరేషన్ గెలిచే బాధ్యతలను ఆ జిల్లాతో సంబంధం లేని గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు అప్పగించారట. దీంతో చిన్నరాజప్ప వర్గం అలకబూనిందని తెలుస్తోంది. అయితే, ఇది తాత్కాలిక మేనని, ఎన్నికల వేళకి అంతా సర్దుమణుగుతుందని అంటున్నారు. మొత్తానికి చిన్నరాజప్ప విషయంలో సీఎం అనూహ్య నిర్ణయం ఆశ్చర్యానికి గురిచేసింది.