రాజధాని ప్రాంతంలో అవినీతి! రైతుల భూముల సేకరణలో అవినీతి! ప్రాజెక్టుల నిర్మాణాల్లో అవినీతి! అన్నింటిలోనూ పెద్దల హ్యాండ్! వారి కనుసన్నల్లోనే ఇటువంటి అక్రమ వ్యవహారాలన్నీజరుగుతున్నాయంటూ.. ఏపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. కొన్ని సర్వేల్లోనూ ఇదే విషయం తేటతెల్లమవుతోంది. ప్రస్తుతం రాజధాని నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల నిర్మాణాలనికి సిద్ధమవుతున్న తరు ణంలో.. భారీగా కోట్లు కొట్టేయడానికి ప్రభుత్వ పెద్దలు సిద్ధమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంట్రాక్టర్లు, టెండర్లు అంటూ హడావుడి చేసినా.. అవన్నీ వారి చేతుల్లోకి వెళతాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అమరావతిని అత్యంత అద్భుత నగరంగా తీర్చిదిద్దుతాం. అధునాతనమైన టెక్నాలజీతో.. సాంకేతిక హంగులతో దీనిని నిర్మిస్తాం అంటూ ఏపీ సీఎం చంద్రబాబు గట్టిగా చెబుతున్నారు. కానీ దీనికి సంబంధించిన డిజైన్లు, భవనాల ఆకృతి.. వంటి పలు కీలక అంశాలు మాత్రం ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. అయితే.. ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఐఏఎస్ల ఇళ్ల నిర్మాణాలకు ఇప్పుడు ఏపీ సీఆర్డీయే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులోనూ బిగ్ స్కామ్ కు బీజం వేశారనే వాదన వినిపిస్తోంది. అంచనాలు తయారు చేసేది ఇంజనీర్లే అయినా…వాటిని నడిపించేది మాత్రం ప్రభుత్వంలోని పెద్దలే ననే వార్తలు ఇప్పుడు చక్కెర్లు కొడుతున్నాయి.
18 టవర్స్ కింద ప్రజా ప్రతినిధులు..ఐఏఎస్ లకు 609 కోట్ల రూపాయలు వెచ్చించి 432 అపార్ట్ మెంట్లను నిర్మించను న్నారు. ఈ లెక్కన చూస్తే ఒక్కో అపార్ట్ మెంట్ వ్యయం 1.40 కోట్ల రూపాయలుగా పడుతుంది. దీనిపైనే ఇప్పుడు విమర్శలు గుప్పుమంటున్నాయి. భూమి ధర లేకుండానే కేవలం నిర్మాణ ఖర్చులకే అపార్ట్ మెంట్ కు 1.40 కోట్ల రూపాయల ధర దారుణమని..హైదరాబాద్ లోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో చూసినా భూమి ధరతో కలుపుకుని అంత ప్రీమియం అపార్ట్ మెంట్ వస్తుందని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. అమరావతిలో కేవలం నిర్మాణానికే 1.40 కోట్ల రూపాయల ధర నిర్ణయించటం అంటే ఇది స్కామే అనే అంటున్నారు.
ఒక్కో అపార్ట్ మెంట్ మూడు వేల చదరపు అడుగుల్లో నిర్మించినా అడుగుకు నాలుగు వేల ధర వేసుకున్నా..ఆ మొత్తం రూ. 1.20 కోట్లు దాటదు. భూమితో కలుపుకొని అడుగు నాలుగు వేల ధరతో హైదరాబాద్ లో అత్యంత ఖరీదైన ప్రాంతా ల్లోనే అపార్ట్ మెంట్లు వస్తాయి. అలాంటిది కొత్తగా నిర్మించే ఈ ప్రాంతంలో ఈ ధర నిర్ణయించటం దారుణమం టున్నారు. మరి ఇప్పుడు మరో భారీ స్కీమ్కు రంగం సిద్ధమైందని మాత్రం విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.