ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ముందస్తుగానే జరగనున్నాయా? షెడ్యూల్ కన్నా కనీసం ఆరు మాసాల ముందుగానే ఎన్నికలు జరుగుతాయా? ఈ ప్రశ్నలకు ఔననే అంటున్నారు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు. నిన్న నంద్యాల రోడ్ షో అనంతరం ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల ప్రస్తావన తెచ్చారు. రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారం 2019 మేలో ఎన్నికలు జరగాల్సి ఉందన్నారు. అంటే కనీసం రెండేళ్లు ఉంటుందని, అయితే, ఇప్పుడు పరిస్థితి మారిందని, కనీసం ఆరు నెలల ముందుగానే ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నారు.
‘ఒకే దేశం.. ఒకే ఎన్నికలు’ ప్రాతిపదికన దేశవ్యాప్తంగా 2019 ఏప్రిల్-మే నెలల్లో జరగాల్సిన సార్వత్రిక ఎన్నికలు ముందుగానే రానున్నాయని చంద్రబాబు చెప్పుకొచ్చారు. 2018 డిసెంబరులోనే దేశవ్యాప్తంగా ఒకే దఫా ఎన్నికలు జరగనున్నాయన్నారు. ‘సార్వత్రిక ఎన్నికలు ముగిసి మూడేళ్లయింది. మిగిలింది రెండేళ్లే. ముందస్తు ఎన్నికలు జరపాలనుకుంటే 2018 డిసెంబరులోనే ఎన్నికలు రావచ్చు. అంటే నంద్యాల ఎన్నిక కేవలం ఏడాదిన్నర కోసమే’ అని వివరించారు.
మరో ముఖ్య విషయం ఏంటంటే.. మోడీ ఎలాగూ ముందస్తు ఎన్నికలకు వెళ్లిపోవడం ఖాయమైంది. దీంతో చంద్రబాబు కూడా మోడీనే అనుసరించే ఛాన్సులు ఉన్నాయని తెలుస్తోంది. మోడీ లోక్సభను రద్దుచేసిన వెంటనే బాబు కూడా అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. మోడీ తనకు ఉన్న వేవ్ను వాడుకోవాలనుకుంటున్నాడు.. మరి ఇప్పుడు చంద్రబాబు కూడా లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లిపోవాలని అనుకుంటున్నారు. అంటే మోడీ వేవ్ను బాబు కూడా వాడుకుని మరోసారి సీఎం సీటును కైవసం చేసుకునేందుకు రెడీ అవుతున్నట్టే కనిపిస్తోంది.
ఇక్కడ కొసమెరుపు ఏంటంటే.. వైసీపీ అధినేత జగన్ కూడా ఇప్పటికి చాలా సార్లు.. రాష్ట్రంలో ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చు. మీరంతా రెడీగా ఉండండి అంటూ తన పరివారాన్ని ఇటీవల జరిగిన ప్లీనరీలో హెచ్చరించారు. అప్పట్లో అందరూ దీనిని లైట్గా తీసుకున్నా.. ఇప్పుడు బాబు కూడా ఇదే మాట చెప్పారు కాబట్టి.. రాష్ట్రంలో 2018లోనే ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు విశ్లేషకులు. మరి ఎంత మేరకు నిజమవుతాయో చూడాలి.