ఒకపక్క ఎన్నికలు, మరోపక్క సర్వేలు ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నిద్రలేకుండా చేస్తున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్వహించే సర్వేలంటే.. ఎమ్మెల్యేలు భయపడిపోతున్నారు. ఇందులో వచ్చిన ఫలితాల ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో సీట్లు కేటాయిస్తారనే ప్రచారం జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ సర్వే ఆధారంగా జాబితా రూపొందించడం.. ర్యాంకులు ప్రకటించడం చేస్తుంటారు కేసీఆర్! ఇప్పటికే రెండు సార్లు సర్వేలు నిర్వహించి.. ఎమ్మెల్యేల్లో కొందరికి సూచనలు, సలహాలు మరికొందరికి వార్నింగ్లు ఇచ్చేశారు.
ఇప్పుడు ఆయన మూడోసారి సర్వే నిర్వహిస్తున్నారని.. టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఎమ్మెల్యేల్లో గుబులు మొదలైందట. ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహించడం తెలంగాణ సీఎం కేసీఆర్కు బాగా అలవాటు! మొన్నటికి మొన్న ఏపీ గురించి కూడా సర్వే నిర్వహించి కలకలం సృష్టించేశారు. కేసీఆర్ సర్వేల్లో మరో ట్విస్ట్ ఏంటంటే… సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే కాదు విపక్షాల నియోజకవర్గాల్లోనూ ఆయన సర్వే చేయిస్తారు. విపక్ష నేతల పట్ల ప్రజలు ఏ మేరకు సంతృప్తిగా ఉన్నారో కూడా లీక్ చేస్తారు. అందుకే కేసీఆర్ సర్వేలంటే అధికారపక్షానికే కాదు విపక్షాలకు కూడా కొంత భయమే.
కేసీఆర్ ఇటీవల ఎమ్మెల్యేలపై సర్వే నిర్వహిస్తూ.. వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు సర్వే చేయించారు. సర్వే ఫలితాలను కూడా ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు, ఎంపీలకు కూడా ఇచ్చేశారు. ఎవరు తక్కువ స్థాయి మార్కులతో ఉన్నారో ఎవరు అగ్రభాగాన ఉన్నారో వారి మొహం మీద చెప్పేశారు. తీరు మార్చు కోడంటూ హెచ్చరికలు కూడా జారీ చేసేశారు. ఇప్పటికి రెండు సార్లు జరిపిన సర్వేలో టీఆర్ఎస్ కు దాదాపు వందకు పైగా స్థానాలు వస్తాయని తేలింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ మూడో విడత సర్వే చేయిస్తున్నారు.
ఈ సర్వేకు ప్రత్యేక ప్రాధాన్యముందంటున్నారు గులాబీ పార్టీ నేతలు. ఎన్నికలకు ముందు జరిపే సర్వే కావడంతో దీని ఆధారంగానే టిక్కెట్లు కేటాయిస్తారన్న ప్రచారం జరుగుతుండటంతో అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో దడ మొదలయింది. గత సర్వేల్లో తక్కువ శాతం వచ్చిన వావారంతా నియోజకర్గాలకే పరిమితమయ్యారు. హైదరాబాద్ కు రావడమే మానుకున్నారు. దీంతో మూడోసారి సర్వేలోనైనా తాము అగ్రభాగాన ఉంటామన్న నమ్మకంతో ఉన్నారు.
అయితే సర్వే ఫలితాల్లో కేవలం నియోజకవర్గ ఎమ్మెల్యే పనితీరు మాత్రమే కాకుండా కేసీఆర్ పాలన ప్రభావం కూడా ఉంటుందంటున్నారు కొందరు ఎమ్మెల్యేలు. మూడోసారి కేసీఆర్ చేస్తున్న సర్వేతో ఎవరికి మూడుతుం దోనన్న టెన్షన్ గులాబీ నేతలకు పట్టుకుంది. మరి ఈసారి సర్వే ఎవరి తలరాత మర్చనుందో వేచిచూడాల్సిందే. ఇక సర్వేల్లో పనితీరు సరిగా లేని వారికి 2019 ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వనని కూడా కేసీఆర్ చెప్పేశారు. దీంతో ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైకి డాంబికంగా ఉన్నా లోపల మాత్రం వారు తీవ్ర ఆందోళనతో ఉన్నారు.