నంద్యాల ఎన్నికల్లో గెలుపు కోసం.. టీడీపీ, వైసీపీ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అంతేగాక పోరు చివరి దశకు చేరుకోవ డంతో వివిధ వర్గాలను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు కూడా ముమ్మరమయ్యాయి. ప్రచారానికి ముగింపు తెరపడనున్న సమయంలో పొలిటికల్ సీన్లోకి సినీ హీరోల అభిమానులు ఎంట్రీ ఇచ్చారు. తమ మద్దతు ఫలానా పార్టీకే అంటూ ప్రక టించేస్తున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేశ్ అభిమానులు వైసీపీకి మద్దతు ఇవ్వగా, ఇప్పుడు అక్కినేని నాగార్జున అభిమానులు కూడా వైసీపీ చెంతకు చేరిపోయారు. అయితే దీని వెనుక బలమైన కారణం కూడా లేకపోలేదని తెలు స్తోంది. వైసీపీ నుంచి వచ్చిన హామీ మేరకు నాగార్జున వ్యూహాత్మకంగా వైసీపీకి మద్దతు ఇస్తున్నారని సమాచారం!
ఇప్పటివరకూ సామాజికవర్గాల సంఘాలు నంద్యాల ఎన్నికల్లో తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి. కానీ ఇప్పుడు అభిమానుల సంఘాలు కూడా రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నాయి. సినీ హీరోలు ప్రత్యక్షంగా కాకపోయినా.. పరోక్షంగా తమ మద్దతును రాజకీయ పార్టీలకు ప్రకటించేస్తున్నారు. ఇప్పటికే జనసేన అభిమానులంతా టీడీపీకి మద్దతు ఇస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక వైసీపీకి మద్దతుగా నాగార్జున అభిమానులు మద్దతు ఇచ్చారు. అయితే దీని వెనుక నాగ్ వ్యూహం కూడా ఉందట. త్వరలో నాగార్జున వైసీపీలో చేరిపోతారని, 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున నాగార్జున.. గుంటూరు నుంచి ఎంపీగా పోటీచేస్తారనే ప్రచారం జోరుగా జరిగింది.
దీనిని నాగార్జున ఖండించకపోయినా.. ఆయన భార్య అమల మాత్రం వ్యతిరేకించారు. నాగార్జున రాజకీయాల్లోకి రారని స్పష్టం చేశారు. దీంతో ఆ ప్రచారానికి ముగింపు పడింది. నాగార్జునకు నిమ్మగడ్డ ప్రసాద్ అత్యంత సన్నిహితుడు. అయితే 2019 ఎన్నికల్లో నిమ్మగడ్డ ప్రసాద్ వైసీపీ తరఫున విజయవాడ ఎంపీగా పోటీ చేస్తారని తెలుస్తోంది. ఈ మేరకు దాదాపు సీటు ఖరారైంది. దీంతో.. నంద్యాలలో వైసీపీ గెలుపు కోసం నాగార్జున బరిలోకి దిగాడని సమాచారం. అందుకే
వైసీపీ అభ్యర్థికే తమ మద్దతు అని అఖిలభారత అక్కినేని నాగార్జున ఫ్యాన్స్ అసిసోయేషన్ అధ్యక్షుడు ఏవీ నాగరాజుతో ప్రకటన విడుదల చేయించారట. ప్రచారం గడువు ముగిసిపోతుండటంతో పాటుగా పోలింగ్ సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అభిమాన సంఘాలు సైతం తమ స్టాండ్ ను స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ నేత - ప్రిన్స్ మహేశ్ బాబు బాబాయ్ ఆదిశేషగిరిరావు మహేశ్ ఫ్యాన్స్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమ మద్దతు శిల్పాకే అని వారు ప్రకటించారు. అంతేకాకుండా వారు క్షేత్రస్థాయిలో ప్రచారం కూడా చేస్తున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో ఇవి మరింత కీలకంగా మారే అవకాశాలు లేకపోలేదు.
ఇక నాగార్జునకు చంద్రబాబు, బాలయ్యతో గ్యాప్ ఉంది. అందుకే జూనియర్ ఎన్టీఆర్తో సఖ్యతతో ఉండే నాగ్ బాబు, బాలయ్యతో మాత్రం గ్యాప్ మెయింటైన్ చేస్తుంటాడు. ఈ క్రమంలోనే నాగ్ తెలంగాణలో వ్యాపారాలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు మంత్రి కేటీఆర్కు దగ్గరవుతున్నాడు. అందుకే తనకు కాబోయే కోడలు సమంతను తెలంగాణ చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక చేయించాడు. ఇప్పుడు ఏపీలో బిజినెస్ విస్తరణ కోసం నాగ్ జగన్ గ్యాంగ్తో స్నేహంగా ఉంటూ ఆ పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్టే కనపడుతోంది.