గత కొంతకాలంగా తీవ్ర ఆసక్తి రేపుతున్న ట్రిపుల్ తలాక్ చట్టబద్ధత అంశంపై సుప్రీంకోర్టు నేడు తీర్పును వెల్లడించనుంది. దేశంలో ఉమ్మడి పౌర సృతి తేవాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సమయంలో ట్రిపుల్ తలాక్పై సుప్రీం కోర్టు ఏ విధమైన తీర్పు ఇస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రధాన న్యాయమూర్తి జెఎస్ ఖేహర్ అధ్యక్షతన గల ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించనుంది.
వివాదస్పదంగా మారిన ట్రిపుల్ తలాక్ అంశంపై కేంద్రం, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, ఆల్ ఇండియా ముస్లిం వుమెన్ పర్సనల్ లా బోర్డు దాఖలు చేసిన పలు పిటీషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సీజే. ఖెహర్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. మే 11న ప్రారంభమైన విచారణ మే 18తో ముగిసింది. ఆరు రోజుల విచారణ అనంతరం అత్యున్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్లో పెట్టిన విషయం తెలిసిందే.
అప్పట్లో సుప్రీంకోర్టు ధర్మాసనంలో సిక్కు, క్రైస్తవ, పార్శీ, హిందు, ముస్లిం ఇలా అన్య మతస్థులు సభ్యులుగా ఉన్నారు. ట్రిపుల్ తలాక్ రాజ్యాంగబద్ధమైన అంశమా...? మతపరమైన హక్కా..? అన్న కోణంలో విచారణ జరిపారు... నిఖా హలాలా, బహుభార్యత్వంపై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇక ట్రిపుల్ తలాక్కు వ్యతిరేకంగా షయారా బానో 2016లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ట్రిపుల్ తలాఖ్, బహు భార్యత్వం చట్టవిరుద్ధంగా పేర్కొనాలని కోరారు.ముస్లిం మత సాంప్రదాయంలో మూడు సార్లు తలాక్ అంటే భార్యాభర్తల మధ్య బంధం తెగిపోయినట్లే. ఈ ఆచారం పట్ల ముస్లిం మహిళలు సైతం వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. నేడు సుప్రీం ధర్మాసనం తీర్పును వెలువరించనుంది.