నంద్యాల ఉప పోరుకు సంబంధించిన ప్రచారం ముగిసింది. సోమవారం సాయంత్రంతో అక్కడ గత పదిహేను రోజులకు పైగా హోరెత్తిస్తున్న మైకులు ఒక్కసారిగా మూగబోయాయి. ఇక, మరి కొన్ని గంటల్లోనే ఓటర్లు తమ తీర్పును చెప్పేందుకు రెడీ కూడా అయిపోయారు. ఇది ఓ భాగం. ఇక, ప్రచారం పర్వం విషయానికి వచ్చేసరికి.. గతంలో రాష్ట్రంలో జరిగిన ఏ ఉప ఎన్నికలోనూ ఇంత భారీ స్థాయిలో ప్రచారం జరగలేదని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. రాష్ట్రంలో గతంలో అనేక సార్లు ఉప ఎన్నికలు జరిగాయి. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఈ ఎన్నికల్లో అనేక పార్టీలు పాలుపంచుకున్నాయి. అయితే, నంద్యాల తరహా ఎన్నికల ప్రచారం జరగలేదన్నది వారి మాట.
అలా ఎందుకు అనాల్సొస్తోందో కూడా వారే చెబుతున్నారు. సాధారణంగా ఉప పోరైనా, సాధారణ ఎన్నికలైనా విపక్షం దాడి, మాటల యుద్ధం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అధికార యంత్రాంగాన్ని విస్తృతంగా వాడేసి... ఓటర్లను ప్రభావితం చేసేస్తున్నారని, కాబట్టి.. ఎన్నికలను రద్దు చేయాలనో, వాయిదా వేయాలనో.. లేదా కేంద్ర పరిశీలకుల సమక్షంలో ఎన్నికలు నిర్వహించాలనో ఇలా అనేక డిమాండ్లను విపక్షాలు కోరడం, దానికి అనుగుణంగా అధికార పక్షం దీటుగా స్పందించడం మనం చూశాం. అయితే, వీటన్నింటీ విరుద్ధంగా.. ఇప్పుడు నంద్యాలలో.. విపక్షం పాత్ర అధికార టీడీపీ నేతలు పోషించారని స్పష్టమైంది.
నిజానికి నంద్యాలలో విపక్షం భారీ ఎత్తున విమర్శలు గుప్పించాలి. అక్కడ ఎన్నికలను వాయిదా వేయాలని, డబ్బు ఇతరత్రా పంపిణీ పెరిగిపోయిందని, అధికారులు తమ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారని వైసీపీ ఆరోపణలు చేయాల్సి ఉండగా.. రివర్స్ గేర్లో టీడీపీ ఈ ఆరోపణలు చేయడం, ఆఖరికి ఎన్నికలు వాయిదా వేయాలని ఈసీని అభ్యర్థించడం చూస్తే.. నిజానికి అధికార టీడీపీ నేతలేనా ఇవన్నీ చేస్తున్నారు? అని అనిపించింది. అయితే, దీనివెనుక ఓ పెద్ద ప్లాన్తోనే టీడీపీ చేసిందని కొందరంటే.. కాదు... కాదు.. డిఫెన్స్లో పడిపోయిన కారణంగానే టీడీపీ నేతలు చిందులు తొక్కారని మరికొందరు అన్నారు.
ఏదైతేనేం.. వైసీపీ పాత్రను టీడీపీనే పోషించి రక్తి కట్టించింది. ఇక, విపక్షం వైసీపీలో ఎందుకనో.. జగన్ తప్ప ఎవరూ పెద్దగా నంద్యాలలో కనిపించలేదు. వాస్తవానికి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి వంటి వారు సీఎం చంద్రబాబు పేరు గుర్తొస్తే చాలు.. నిప్పుపై ఉప్పులా మండిపడతారు. అలాంటి వ్యక్తి నంద్యాలలో కనిపించలేదు. ఇక, రోజా కూడా చివరి రెండు రోజులు మినహా ఎక్కడా దొరకలేదు. ఇక, చంద్రబాబుపై చండ్రనిప్పులు కురిపించే గుడివాడ ఎమ్మెల్యే నాని కూడా కేవలం ఒక రోజు ఉండగానే నంద్యాలకు వచ్చాడు. ఇలా వైసీపీ ఏమో అధికార పక్షం మాదిరిగా ధీమాగా వ్యవహరించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మొత్తానికి నంద్యాల ఓటర్లు ఎటు మొగ్గు చూపుతారో చూడాలి.