ఇప్పుడు ఈ విషయంపైనే హైదరాబాద్లోని వైసీపీ కేంద్ర కార్యాలయం లోటస్ పాండ్లో చర్చోపచర్చలు సాగుతున్నాయి. దేశంలో అత్యంత కీలకమైన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్రంలోని ప్రధాని మోడీ సర్కారు.. కేబినెట్ విస్తరణపై దృష్టి పెట్టింది. ప్రస్తుత మిత్రపక్షాలు, అప్పటికి కలిసివచ్చే మిత్ర పక్షాలను కలుపుకొని కిచిడీ కేబినెట్ను ఏర్పాటు చేయాలని డిసైడ్ అయినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే బిహార్, ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ కేబినెట్ కూర్చు, చేర్పులపై పెద్ద ఎత్తున ఊహాగానాలు, స్టోరీలు హల్ చల్ చేస్తున్నాయి.
మన విషయానికి వచ్చే సరికి... 2014లో టీడీపీ అధినేత చంద్రబాబుతో జట్టు కట్టిన బీజేపీ.. 2019 నాటికి తన వ్యూహాన్ని మార్చాలని డిసైడ్ అయింది. అప్పటికి గెలుపు గుర్రం ఎవరైతే వారితోనే చేతులు కలపాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ఏపీ విపక్షం వైసీపీ అధినేత జగన్తో చెలిమి ప్రారంభించింది. ఇక, కేసులైతేనేమి, 2019 నాటికి సీఎం సీటు దక్కించుకోవాలంటే.. తన ఒక్కడి బలం సరిపోదని అనుకోవడం అయితేనేమి.. మొత్తానికి జగన్ కూడా ఢిల్లీ అండ కోసం పాకులాడాడు. ఈ క్రమంలోనే అడగకుండనే రాష్ట్రపతి ఎన్నికల సమయంలో ఎన్డీఏ అభ్యర్థి కోవింద్కు జై కొట్టాడు.
ఇక, ఉపరాష్ట్రపతి ఎన్నిక సమయంలోనూ వైసీపీ మద్దతు తెలిపింది. ఈ నేపథ్యంలో ఇక, బీజేపీ-వైసీపీలు జట్టుకట్టి జంటగా 2019 ఎన్నికలకు వెళ్లనున్నాయనే వార్తలు హల్ చల్ చేశాయి. ఇక, ఇప్పుడు కేంద్రం తన మంత్రి వర్గంలో వైసీపీకి చోటు కల్పించవచ్చని, ఫలితంగా బంధం మరింద గట్టి పడుతుందని భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిని బట్టి ఈ నెల ఆఖరు, లేదా వచ్చే నెల రెండో వారంలో కానీ, కేంద్ర కేబినెట్లో మార్పులు ఉండే అవకాశం ఉంటుందని అంటున్నారు.
ఉపరాష్ట్రపతిగా వచ్చేసిన వెంకయ్య ప్లేస్తోపాటు రక్షణ శాఖ మాజీ మంత్రి మనోహర్ పర్రీకర్ సీట్లుఖాళీ అయినందున వారి స్థానాల్లో మంత్రులను నియమించాల్సి రావడంతో కేబినెట్ విస్తరణ అనివార్యమని అంటున్నారు. ఈ క్రమంలోనే ఏపీ నుంచి సీటు దక్కే అవకాశం వైసీపీ లభించనుందనే వార్తలు వస్తున్నాయి. దీంతో వైసీపీ అధినేత జగన్ ఢిల్లీ రాజకీయాల్లో ఇక చురుకుగా వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.