నంద్యాల ఉపఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా 80శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్టు అంచనా. 6 గంటల తర్వాత కూడా క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు అధికారులు. ఈ నెల 28వ తేదీన ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.
ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన నంద్యాల ఉపఎన్నిక ముగిసింది. దీంతో అధికారులు, అభ్యర్థులు, నంద్యాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అత్యంత సమస్యాత్మక నియోజకవర్గం కావడంతో అడుగడుగునా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
ఉదయం నుంచి ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు భారీగా తరలివచ్చారు. మధ్యాహ్నానికే 50 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. ముఖ్యంగా అర్బన్ తో పోల్చితే రూరల్ ఓటర్లు భారీగా తరలివచ్చారు. పురుషులతో పోల్చితే మహిళలు అధికంగా ఓటింగ్ లో పాల్గొన్నట్టు సమాచారం.
సాయంత్రం నంద్యాలలోని ఏడో వార్డులు టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. అయితే పోలింగ్ కు ఎలాంటి అంతరాయం కలగలేదు. అయితే పోలింగ్ ముగుస్తున్న సమయంలో ఆత్మకూరు బస్డాండ్ వద్ద శిల్పా, భూమా కుటుంబీకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. శిల్పా చక్రపాణి రెడ్డి, ఆయన కుమారుడు రవి, భూమా కుమారుడు జగత్, కుమార్తె మౌనిక రెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
చిన్నపాటి సంఘటనలు తప్ప నంద్యాల ఉపఎన్నిక ప్రశాంతంగా ముగియడంతో పార్టీల నేతలు, అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.