ఒక్కోసారి నోటిదురుసు చాలా పెద్ద సమస్యలను తీసుకువస్తుంది. ప్రజాజీవితంలో ఉన్నవారికి ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. వారు ఏం మాట్లాడినా అది పెద్ద వార్తయి కూర్చుంటుంది. వైసీపీ నేత గౌతమ్ రెడ్డి కాపులపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. దీంతో ఆయనపై చర్యలు తీసుకునేందుకు వైసీపీ సిద్ధమైంది.
వైసీపీ ట్రేడ్ యూనియన్ నాయకుడిగా ఉన్న గౌతమ్ రెడ్డి ఆ పార్టీ తరపున పలు వేదికల్లో మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఒక ఛానల్ కు ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అది ఇంకా ప్రసారం కాలేదు. అయితే దానికి సంబంధించిన ప్రోమోలను ఆ ఛానల్ ప్రసారం చేస్తోంది. అందులో గౌతం రెడ్డి చేసిన కామెంట్స్ చాలా సంచలనానికి దారితీస్తున్నాయి.
కాపులు ఎంతో అభిమానించి వంగవీటి రంగా, వంగవీటి రాధాలను ఉద్దేశించి గౌతమ్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వారిని కించపరుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలపై కాపులు భగ్గుమంటున్నారు. గౌతమ్ రెడ్డికి వ్యతిరేకంగా జిల్లాల్లోని కాపు నేతలు మండిపడుతున్నారు. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. మరోవైపు గౌతమ్ రెడ్డికి వ్యతిరేకంగా పలువురు కాపు నేతలు రాధ ఇంటికి చేరుకుని సంఘీభావం ప్రకటించారు.
ఈ నేపథ్యంలో పరిస్థితి చేజారిపోతోందని గమనించిన వైసీపీ అధిష్టానం గౌతమ్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. ఆయన వ్యాఖ్యలతో పార్టీకి ఏమాత్రం సంబంధంలేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారథి స్పష్టం చేశారు. అవి ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలని తేల్చిచెపపారు. వంగవీటి రంగాపై తమకు అపారమైన గౌరవం ఉన్నాయని పార్థసారథి వివరించారు. కాపులతోస సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలు ఆయన్ను అభిమానిస్తారని చెప్పారు.
గౌతమ్ రెడ్డి వ్యాఖ్యలపై షోకాజ్ నోటీస్ జారీ చేస్తున్నట్టు పార్థసారథి వెల్లడించారు. అంతేకాక గౌతమ్ రెడ్డి కామెంట్స్ ను జగన్ తీవ్రంగా ఖండించారని, ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో పార్టీలో ఏ స్థాయి నాయకుడైనా.. ఎవరినైనా కించపరిచినట్లు మాట్లాడతే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని పార్థసారథి తేల్చిచెప్పారు. జగన్ హైదరాబాద్ వచ్చిన తర్వాత గౌతమ్ రెడ్డిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇంటర్వ్యూను ప్రసారం చేసే ఛానల్ తో కూడా మాట్లాడి పార్టీ అభిప్రాయం తీసుకోవాలని కోరుతామని తెలిపారు.