అగ్రరాజ్యం అమెరికా పై ప్రకృతి కన్నెర్రజేసింది. ప్రకృతి ఆగ్రహానికి అమెరికా అంతా అతలాకుతలం అవుతోంది. ఒక ప్రమాదం తప్పిందనుకుంటే మరో ప్రమాదం.. ఇలా వరుస తుపానులతో అగ్ర రాజ్యం విలవిలలాడుతోంది. వరుస తుపానుల ధాటికి పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు విడిచారు. విద్యుత్, రవాణా, సమాచార వ్యవస్థలు అస్తవ్యస్తంగా మారాయి. ఎప్పుడు ఏమవుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
వరుస తుపానులతో అమెరికా అతలాకుతలమవుతోంది. హార్వే ముగిసింది.. ఇర్మా విరుచుకుపడుతోంది.. ఇంతలోనే.. మరో రెండు తుపానులు ముంచుకొస్తున్నాయి. దీంతో అమెరికన్స్ ఎప్పుడు ఏమౌంతుందోనని ప్రాణాలను అరచేత పట్టుకుని బతుకుతున్నారు. హరికేన్ హార్వే తుపాను గంటకు 130 కి.మీ వేగంతో రావడంతో చెట్లు, విద్యుత్తు స్తంభాలు కూలిపోయాయి. ఎన్నో ఇళ్లు, రోడ్లు ధ్వంసమయ్యాయి. కనీసం మూడు లక్షల ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. రవాణా వ్యవస్థ స్తంభించింది.
హార్వే చేసిన భీభత్సం మరువక ముందే ఇర్మా వెంటాడుతోంది. ఫ్లోరిడా దక్షిణ తీరానికి సుదూరంగా అట్లాంటిక్ సముద్రంలో సంభవించిన ఇర్మా.. ఫ్లోరిడాను దాటేందుకు సిద్ధమవుతోంది. ఇర్మా గంటకు 280 కి.మీ వేగంతో వీస్తుందని అధికారులు హెచ్చరించారు. రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కరీబీయన్ దీవులను కుదిపేస్తున్నాయి. క్యూబా, ప్యూర్టోరికో, కరీబియన్ దీవుల్లో ఇర్మా తుపాను బీభత్సం సృష్టించింది. ఫ్లోరిడాపై విరుచుకుపడుతుందని భావిస్తున్న ఇర్మా తుపాను నుంచి బయటపడాల్సిందే ఫ్లోరిడాను ఖాళీ చేయాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. సుమారు 60 లక్షల మంది ప్రజలు తుపాను ప్రభావిత ప్రాంతాల నుంచి తరలివెళ్లారు.
ఇర్మా ప్రభావానికి ఇప్పటికే పదుల సంఖ్యలో మృతి చెందారు. బలమైన గాలులతో ముందుకు సాగుతున్న ఇర్మా వల్ల విద్యుత్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు మూతపడటంతో ఫ్లోరిడాలోని లక్షలాది ఇళ్లు, వ్యాపార సంస్థలు మరికొన్ని వారాల పాటు చీకట్లో మగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. టెక్సాస్లో బీభత్సం సృష్టించిన హార్వీ తుపాను అత్యంత వేగంగా బలహీనపడి తీరం దాటింది. అయితే ఇర్మా తుపాను మాత్రం అందుకు విరుద్ధంగా క్రమంగా బలపడుతోందని వాతావరణ నిపుణులు తెలుపుతున్నారు.
ఇంతలోనే అమెరికాకు మరో ముప్పు ముంచుకొస్తోంది. మెక్సికో గల్ఫ్ లో హరికేన్ కతియా ఆ దేశ తూర్పు తీరాన్ని తాకింది. ప్రారంభంలో రెండో స్థాయి తుపానుగా ఉన్న కతియా హరికేన్ క్రమంగా బలహీనంగా మారి.. ఒకటో స్థాయికి పడిపోయింది. అయితే ఇది మళ్లీ బలపడి విజృంభించే ప్రమాదముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.