రెండు తెలుగు రాష్ట్రాల్లోనే వచ్చే ఎన్నికలకు అందరూ సమాయత్తమవుతున్నా మాస్ మసాలా పాలిటిక్స్ అన్ని ఏపీలోనే జరుగుతున్నాయి. ఏపీ రాజకీయం ఎప్పుడు ఎలా మారుతుందో ? ఎవ్వరికి అర్థం కావడం లేదు. నిన్న మొన్నటి వరకు చంద్రబాబు, టీడీపీని ఓ రేంజ్లో ఏకేసిన కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఇప్పుడు టీడీపీలోకి వెళతారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో నిజానిజాలు ఎలా ఉన్నా నిన్నటి వరకు ఆయన వైసీపీ అధినేత వైఎస్.జగన్ డైరెక్షన్లో పనిచేశారన్న విమర్శలు ఎదుర్కొన్నారు.
కాపులకు రిజర్వేషన్లు కల్పించకుండా చంద్రబాబు నాటకం ఆడుతున్నారంటూ ముద్రగడ ఓ రేంజ్లో ఆయనపై ఫైర్ అయ్యారు. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఆయన కాపులను టీడీపీకి యాంటీగా వైసీపీకి అనుకూలంగా ఓట్లు వేయాలని ప్రేరేపించినట్టు కూడా టీడీపీ విమర్శలు చేసింది. అలాంటి ముద్రగడ ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేను ఆయన ఇంట్లోనే కలిసి చర్చలు జరపడంతో ఆయన టీడీపీ ఎంట్రీ వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి.
నంద్యాలతో పాటు కాపులు బలంగా ఉన్న కాకినాడలోను కాపులంతా టీడీపీకి వన్సైడ్గా ఓట్లు వేసేశారు. తాజాగా ముద్రగడ రాజమండ్రి వచ్చి టీడీపీ సీనియర్ లీడర్, మాజీ మంత్రి, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో మీట్ అయ్యారు. ముద్రగడ వెంట ఆయన సామాజికవర్గానికే చెందిన రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా ఉన్నారు. గతంలో ముద్రగడ టీడీపీలో ఉన్నప్పుడు బుచ్చయ్య ఆయన కలిసి పనిచేశారు. వీరిద్దరి మధ్య ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
బుచ్చయ్య - ముద్రగడ పాత సంబంధాల నేపథ్యంలో కలిశారా ? లేదా ? వీరిద్దరి మధ్యా ఏదైనా రాజకీయ చర్చలు జరిగాయా ? అన్నది కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రాజకీయంగా వైసీపీలోకి వెళితే తనకు ఫ్యూచర్ లేకపోవడంతో పాటు కాపులకు ఏదైనా చేసుకోవాలన్నా సాధ్యం కాదన్న నిర్ణయానికి ఆయన వచ్చినట్టు సమాచారం. ఇప్పటికిప్పుడు పార్టీ మారినా తనపై విమర్శలు వచ్చే ఛాన్స్ ఉన్నందున ఆయన ముందుగా కాపుల సంక్షేమం, రిజర్వేషన్ల కోసం కట్టుబడి ఉండే పార్టీ, ప్రభుత్వానికే తన మద్దతు అని చెపుతూ ఆ తర్వాత నెమ్మదిగా వచ్చే ఎన్నికలకు ముందుగా పసుపు కండువా కప్పుకుంటారని మరికొందరు అంచనా వేస్తున్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో తాను చంద్రబాబుకు చేరువ కావాలంటే బాబు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి, తనకు సన్నిహితుడు, బాబు దగ్గర చాకచక్యంగా మాట్లాడే బుచ్చయ్యే కరెక్ట్ అన్న నిర్ణయానికి వచ్చిన ముద్రగడ ఆయనతో చర్చలు జరిపినట్టు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ ఊహాగానాల సంగతి ఎలా ఉన్నా, నిన్నటి వరకు బాబును, టీడీపీని తిట్టిపోసిన ముద్రగడ ఇప్పుడు ఆ పార్టీ చెంత చేరేందుకు సాహసిస్తారా ? అన్నది కూడా చూడాలి.