లగడపాటి రాజగోపాల్ రాజకీయ పునఃప్రవేశంపై అనుమానాలు తొలగిపోతున్నాయి. రాష్ట్రం విడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని.. నాడు చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నారు లగడపాటి. ఆ తర్వాత కూడా ఆయన రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని పదేపదే చెప్పారు. కానీ సీఎం చంద్రబాబుతో పలుమార్లు కలవడం ద్వారా కొత్త ఊహాగానాలకు తెరలేపారు.
విజయవాడ ఎంపీగా కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ తనకంటూ ఓ ప్రత్యేకతను సాధించుకున్నారు లగడపాటి రాజగోపాల్. అయితే రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ పెద్దఎత్తున ఉద్యమించారు. కానీ అప్పటి కాంగ్రెస్ సర్కార్ తన మాట పట్టించుకోలేదు. తెలంగాణ కల సాకారం చేసేసింది. దీంతో రాజకీయ విరమణ ప్రకటించారు లగడపాటి.
రాష్ట్రం విడిపోయాక ఏనాడూ రాజకీయ వేదికలపై కనిపించలేదు. రాజకీయాల గురించి మాట్లాడలేదు. రాజకీయాల్లో మళ్లీ వచ్చే ఉద్దేశమే లేదన్నారు. తన టీం ద్వారా ఎన్నికల సర్వేలను మాత్రం చేయిస్తూ వచ్చారు. తాజాగా నంద్యాల ఉపఎన్నికల్లో కూడా టీడీపీ మంచి మెజారిటీతో గెలుస్తుందని చెప్పారు.
అయితే తాజాగా లగడపాటి సీఎం చంద్రబాబుతో భేటీ కావడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో కూడా ఆయన సెక్రటేరియేట్ కు వెళ్లి సీఎంతో భేటీ అయ్యారు. అప్పట్లోనే ఆయన టీడీపీలో చేరబోతున్నారనే ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు కూడా అవే వదంతులు వచ్చాయి. కానీ లగడపాటి మాత్రం సీఎం పిలవడం వల్లే వచ్చానని కూల్ గా చెప్పారు. పైగా రాజకీయాల గురించి ప్రస్తావని రాలేదన్నారు.
విశ్వసనీయ వర్గాల ప్రకారం వచ్చే ఏడాది లగడపాటి టీడీపీలో చేరనున్నారు. వచ్చే మార్చిలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో లగడపాటి టీడీపీ తరపున బరిలో దిగనున్నారు. లగడపాటిని పార్టీలో చేర్చుకోవడం ద్వారా రాజధానిప్రాంతంలో తమకు మరింత కలసివస్తుందనేది చంద్రబాబు ఎత్తుగడ. అదే సమయంలో లగడపాటిని వైసీపీలోకి వెళ్లకుండా అడ్డుకోవడం కూడా ఒక వ్యూహమే. తన బలపడకపోయినా శతృవు బలపడకుండా చూడాలని చంద్రబాబు ప్లాన్ వేశారు. అందులో భాగంగానే లగడపాటికి బంపరాఫర్ ఇచ్చినట్టు తెలిసింది.