ఇటీవలికాలంలో టీడీపీ వందశాతం సీట్లూ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంటే ఏపీలో 175 స్థానాలకుగానూ 175 గెలుచుకోవాలని ఆకాంక్షించింది. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు, మంత్రి లోకేశ్ కూడా అదే మాట చెప్తున్నారు. దీంతో బీజేపీలో కొత్త సందేహం మొదలైంది.
175 స్థానాలనూ టీడీపీ గెలవాలని ప్రతిపక్షమనేదే లేకుండా చేయాలని ఈ మధ్య పసుపుదళం గట్టిగా మాట్లాడుతోంది. అందుకోసం ఇంటింటికీ టీడీపీ లాంటి కార్యక్రమాలు చేపట్టింది. టీడీపీ నేతలు చేస్తున్న మాటలు బీజేపీలో కొన్ని సందేహాలను లేవనెత్తాయి. 175 స్థానాలూ గెలవాలి అని బాబు, లోకేశ్ చెప్తున్నారంటే ఇక అసెంబ్లీ స్థానాల పెంపు లేనట్లేనని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడ్డారు.
విష్ణుకుమార్ రాజు లేవనెత్తిన మరో లాజికల్ క్వశ్చన్ ఏంటంటే 175 సీట్లూ టీడీపీకే వచ్చేస్తే మరి మా సంగతేంటి అని..!! అంటే బీజేపీతో పొత్తు ఉండకూడదనుకుంటున్నారా.. అని విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు. బీజేపీతో పొత్తు లేకుండానే ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారా... లేకుంటే బీజేపీతో కలిపి 175 సీట్లు లెక్కేశారా.. అని ఆయన అడిగారు.
విష్ణుకుమార్ రాజు లేవనెత్తిన లాజికల్ క్వశ్చన్ కరెక్టేననిపిస్తోంది. ఒంటరిగానే అన్ని సీట్లూ గెలవాలనుకుంటున్న టీడీపీ ... బీజేపీని ఏం చేయబోతోంది..? ఒంటరిగానే ఎన్నికలకు వెళ్ళాలని డిసైడైపోయారా..? దీనికి బాబు ఏం సమాధానం చెప్తారు..? వేచి చూద్దాం మరి..!