నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో ఓటమి తర్వాత నవరత్నాల సభలు, వైయస్ఆర్ కుటుంబం లాంటి కార్యక్రమాలతో వైసీపీ త్వరగానే బయటపడుతోందన్న సంకేతాలు నిన్న మొన్నటి వరకూ కనిపించాయి. అయితే అవన్నీ సోషల్ మీడియాకు మాత్రమే పరిమితమని స్పష్టమవుతోంది. గ్రౌండ్ లెవల్ లో ఇంకా ఆ పార్టీలో అంతర్గత విభేదాలు తారస్థాయిలో ఉన్నాయని నవరత్నాల సభలు రుజువు చేస్తున్నాయి. దీంతో ఏం చేయాలో తెలియక అధినేత ఆపసోపాలు పడుతున్నారు.
వైసీపీ నేతల మధ్య కుమ్ములాటలు ఆ పార్టీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైఎస్ కుటుంబం నవరత్నాల సభలపైన ఆ విభేదాలు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నవరత్నాల సభలు ఇంకా కొన్ని నియోజగవర్గాల్లో ప్రారంభం కాకపోవడంతో అధిష్టానం ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే విభేదాలు పక్కన పెట్టి నవరత్నాల సభలను పూర్తి చేయాలని జగన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
నంద్యాల, కాకినాడ ఎన్నికల తరువాత డీలాపడ్డ వైసీపీకి తాజా పరిణామాలు మరింత తలనొప్పిగా మారాయి. విజయవాడ నేతల మధ్య తలెత్తిన విభేదాలు.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అయితే మిగిలిన జిల్లాల్లోనే దాదాపు ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని.. అవన్నీ నివురుగప్పిన నిప్పులా ఉన్నాయని తాజా సంఘటనలు రుజువు చేస్తున్నాయి. నవరత్నాల సభల సందర్భంగా ఈ విభేదాలు బట్టబయలయ్యాయి.
వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన కార్యచరణలో భాగంగా ఆగస్టు 11 నుంచి 29 వరకు అన్ని నియెజకవర్గాల్లో నవరత్నాల సభలు నిర్వహించాలి. అయితే నంద్యాల, కాకినాడ ఎన్నికల నేపథ్యంలో సెప్టెంబర్ పదిలోపే వాటిని పూర్తిచేయాలని ఆదేశించింది. అయితే చాలా నియోజకవర్గాల్లో పార్టీ కోఆర్డినేటర్లు ఈ సభలను పట్టించుకోలేదు.
వైసీపీకి చాలా చోట్ల నియోజకవర్గానికి ఇద్దరు సమన్వయకర్తలు ఉన్నారు. దీంతో వారి మధ్య ఉన్న విభేదాల కారణంగా ఎవరికి వారు ఈ కార్యక్రమాన్ని పక్కన పెట్టేశారు. కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ముత్తంశశి మధ్య విభేదాల నేపథ్యంలో ఇంతవరకూ నవరత్నాల సభ జరగలేదు. అలాగే చిత్తూరులో సీకే బాబు, పార్టీ ఇన్ఛార్జ్ మధ్య ఆధిపత్యపోరు బట్టబయలైంది. విజయనగరం జిల్లాలో కూడా సేమ్ సీన్ కనిపించింది. దీంతో పార్టీ అధిష్టానం నేరుగా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
మరోవైపు.. మరికొన్ని నియోజకవర్గాల్లో పూర్తి నైరాశ్యం కనిపిస్తోంది. ఏం చేసినా ఏం ఉపయోగం లేదనే ఆలోచనకు వచ్చేశారు. సభలు పెట్టి చేతులు కాల్చుకోవడం తప్ప ఉపయోగం ఏముంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో కోఆర్డినేటర్ లక్ష్మినారాయణ హత్యకు గురయ్యారు. దీంతో ఆయన భార్య శ్రీదేవిని నియమించారు. అయితే డబ్బులు లేకపోవడంతోనే నవరత్నాల సభను జరపలేదని ఆమె తేల్చేశారు. బనగానపల్లెలోనూ ఇదే పరిస్థితి. ఆ నియోజకవర్గ ఇన్ చార్జ్ కాటసాని రామిరెడ్డి అసలు సభ ఎందుకు పెట్టలోదో కూడా చెప్పలేదు. ఉత్తరాంధ్రలోని పలు నియోజకవర్గాల్లో అసలు పార్టీ నేతల మధ్య సఖ్యత లేకపోవడంతో నవరత్నాల సభలను పట్టించుకోవడమే మానేశారు.
కాకినాడ, నంద్యాల ఎన్నకల ఫలితాల తరువాత పార్టీ నేతలు పార్టీ మారుతున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎవర్ని గట్టిగా మందలించలేని స్ధితిలో నాయకత్వం ఉంది. మరోవైపు ఎంపి విజయసాయిరెడ్డి లాంటి ముఖ్యనేతలు పార్టీ అధినేతకు టచ్ లో లేకుండా పోయార్న ప్రచారంతో కేడర్ లో గందరగోళం నెలకొంది.