అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన. అందుకోసం సింగపూర్, జపాన్, చైనా లాంటి అన్ని దేశాల సహకారాన్ని ఆయన తీసుకుంటున్నారు. ఇక పరిపాలనా భవనాల నిర్మాణంపై ఆయన ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ప్రపంచంలోని ఐకానిక్ భవనాలను తలదన్నే రీతిలో అవి ఉండాలనేది చంద్రబాబు సూచన. అందుకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ప్రఖ్యాత నార్మన్ ఫోస్టర్ కంపెనీ ఆపసోపాలు పడుతోంది.
అమరావతి కోర్ కేపిటల్ లో వచ్చే భవనాలపై డిజైన్లు రూపొందించాల్సిందిగా మొదట జపాన్ కు చెందిన మాకీ అసోసియేట్స్ కు ప్రభుత్వం అప్పగించింది. అయితే ఆ సంస్థ ఇచ్చిన డిజైన్లు సరిగా లేకపోవడంతో తిప్పిపంపింది. ఏం జరిగిందో ఏమో కానీ ఆ తర్వాత మాకీ అసోసియేట్స్ తప్పుకుంది. అనంతరం లండన్ కు చెందిన ప్రఖ్యాత ఆర్కిటెక్చర్ కంపెనీ నార్మన్ ఫోస్టర్ కు డిజైన్ల బాధ్యతను ప్రభుత్వం అప్పగించింది.
నార్మన్ ఫోస్టర్ కంపెనీ ఇప్పటివరకూ మూడు సార్లు ఆకృతులను తయారుచేసి తీసుకొంచింది. అయితే అన్నిటిపైనా కాకుండా అసెంబ్లీ, హైకోర్టు భవనాలను మాత్రం ఐకానిక్ గా ఉండేలా తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. వీటి నిర్మాణంలో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఇందుకు అనుగుణంగా నార్మన్ ఫోస్టర్ కంపెనీ పలు డిజైన్లను సీఎం ముందుంచింది. అయితే ఎలివేషన్ బాగుంటే ఇంటీరియర్ బాగలేకపోవడం, ఇంటీరియర్ బాగుంటే ఎలివేషన్ బాగలేకపోవడం.. లాంటి కారణాలతో అవి రిజెక్ట్ అయ్యాయి.
తాజాగా కోహినూర్ ఆకృతిలో అసెంబ్లీని, బౌద్ధస్థూపం ఆకృతిలో హైకోర్టు భవనాలను తలపించేలా డిజైన్లను తీసుకొచ్చింది నార్మన్ ఫోస్టర్. అయితే ఇవి కూడా చంద్రబాబును పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఎలివేషన్ బాగలేదని, కొన్ని అంశాలు మాత్రం బాగున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. వీటిని మరింత ఆకర్షణీయంగా రూపొందించాలని సీఎం స్పష్టం చేశారు. వాస్తవానికి ఈ నెల్ 30వ తేదీన అసెంబ్లీ భవనానికి శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. అయితే ఆకృతులు ఫైనల్ కాకపోవడంతో ఆ కార్యక్రమం ఇక లేనట్టే.
ఐకానిక్ భవనాల ఆకృతుల రూపకల్పనకు వచ్చే నెల 25వ తేదీ వరకూ చంద్రబాబు గడువిచ్చారు. ఆ తేదీన తానే స్వయంగా లండన్ వస్తానని, నార్మన్ ఫోస్టర్ కంపెనీలోనే ఆ డిజైన్లను పరిశీలిస్తానని స్పష్టం చేశారు. భవనాల నమూనాల నిర్మాణంలో ప్రభుత్వ ఆర్కిటెక్టులు కూడా భాగస్వాములు కావాలని సీఎం సీఆర్డీఏకు సూచించారు. ఇందుకోసం ఓ టీమ్ ను రెడీ చేయాలని సూచించారు.
అంతకుమించి వెంటనే రాజమౌళిని సంప్రదించాలని సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ ను చంద్రబాబు ఆదేశించారు. అవసరమైతే డిజైన్ల రూపకల్పనకోసం రాజమౌళిని లండన్ పంపించాలని సూచించారు. క్రియేటవ్ డైరెక్టర్ గా పేరొందిన బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. బాహుబలిలో రాజమౌళి చూపించిన భవనాలు చంద్రబాబును మంత్రముగ్ధుడిని చేశాయి. అలాంటి ఐకానిక్ భవనాల నిర్మాణానికి సూచనలివ్వాల్సిందిగా రాజమౌళిని పిలిచి చంద్రబాబు సూచించారు. అయితే సినిమాకు, ఒరిజినాలిటీకి చాలా తేడా ఉంటుందని.. తాను ఆ పని చేయలేనని చెప్పేశారు. అయితే తనకు ఏదైనా ఐడియా వస్తే సలహాలివ్వాల్సిందిగా చంద్రబాబును రాజమౌళి కోరారు. ఇప్పుడు మళ్లీ రాజమౌళిని రంగంలోకి దించాలని చంద్రబాబు సూచించారు.