ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం చంద్రబాబు.. ఆర్థిక పరిస్థితి లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ.. అంతర్జాతీయ స్థాయిలో ఈ నగరాన్ని నిర్మింపజేయాలని భావిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు, ప్రపంచంలో అత్యంత వినూత్న, అత్యంత ఖరీదైన, అత్యంత నివాస యోగ్యమైన నగరాల జాబితాలో తొలి 10 స్థానాల్లో అమరావతిని నిలపాలని ఆయన కాంక్షిస్తున్నారు. దీనికిగాను ఆయన చేస్తున్న కృషిని అభినందించకుండా ఉండలేం. అయితే, అదే సమయంలో ఒక్క అమరావతి కోసం గత మూడేళ్లుగా కేవలం ప్రణాళికలు, డిజైన్లు, ముసాయిదాలు, మీటింగులు, విదేశీ పర్యటనలు అంటూ కాలం గడపడాన్ని విమర్శించకుండానూ ఉండలేం.
కాగా, ఈ అమరావతిలో నవ నగరాలు పేరిట పాలన, విద్య, ఆటలు, న్యాయ, మీడియా తదితర నగరాలను భారీ ఎత్తున నిర్మించాలని బాబు సంకల్పించారు. అదేవిధంగా అసెంబ్లీ, మండలి నిర్మాణాలు కూడా ప్రధాన ఆకర్షణగా నిర్మించాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రధాన రాజధాని ప్రాంతానికి ప్రధాని మోడీతో ఇప్పటికే శంకుస్థాపన చేయించారు. దీనికన్నా ముందు.. బాబు తన కుటుంబ సమేతంగా ఈ నగరం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత పరిపాలన భవనాలకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో మరోసారి శంకుస్థాపన చేయించారు.
తాజాగా.. ఇప్పుడు ఈ నెల 30న జరగనున్న దసరా పండుగను పురస్కరించుకుని అసెంబ్లీ, సచివాలయాలకు నాలుగోసారి శంకుస్థాపన చేసేందుకు రెడీ అయిపోయారు? దీంతో అసలు ఒక్క రాజధానికి ఎన్ని శంకుస్థాపన లు, ఎన్నిసార్లు చేస్తారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక, ఇక్కడే మరో కోణం కూడా వెలుగులోకి వచ్చింది. ఇప్పటికి రెండు కంపెనీలను మార్చినా.. అమరావతి డిజైన్లు ఖరారు కాలేదు. ఇటీవల వజ్రాకృతి, స్థూపాకృతిలో ఇచ్చిన డిజైన్లపైనా విమర్శలు రావడంతో దీని నుంచి బాబు వెనక్కి తగ్గారు. దీంతో అక్టోబర్ 25న లండన్ వెళ్లి డిజైన్లను ఖరారు చేయాలని డిసైడ్ అయ్యారు. దీంతో శంకుస్థాపన చేసి ప్రయోజనం ఏంటనే వాదనా వినిపిస్తోంది.
నిజానికి ఛత్తీస్గఢ్ రాజధానిని రాయ్పూర్లో కట్టినప్పుడు(ఇంకా నిర్మాణాలు జరుగుతున్నాయి) కూడా ఇంత హడావుడి చేయలేదు. పైగా ఆ రాష్ట్రం కేంద్రం నుంచి ముక్కుపిండి రాజధానికి డబ్బులు వసూలు చేసింది. ఇక, శంకుస్థాపన అనే కార్యక్రమాన్ని ఒకే ఒక్కసారి నిర్వహించారు. ఇప్పుడు ఇదే విషయంపై మేధావులు తర్జన భర్జన పడుతున్నారు. చంద్రబాబు రాజధాని నిర్మాణాన్ని ప్రచారానికి వాడుకుంటున్నారేమో? అనే సందేహాలను వారు వ్యక్తం చేస్తున్నారు.
సాధారణంగా ఓ ఇంటిని కట్టుకున్నప్పుడు బెడ్ రూం, వంటగది, హాల్ ఇలా రకరకాల పేర్లతో డిజైన్ చేసుకుంటాం కదా.. అలా ప్రతి దానికీ శంకుస్థాపన చేస్తామా? లేక మొత్తం ఇంటికి ఒకే సారి శంకుస్తాపన చేస్తామా? అని వీరు తమలో తామే ప్రశ్నించుకుంటున్నారు. మొత్తానికి బాబు హడువుడి శంకుస్థాపనలపై సర్వత్రా ఇప్పుడు విమర్శలు రాజుకుంటున్నాయి.