రాయలసీమ పేరెత్తగానే ఫ్యాక్షన్ రాజకీయాలు గుర్తొస్తాయి. ఇక అనంతపురం అయితే మరీ ఎక్కువ. అనంతపురం అనగానే పరిటాల కుటుంబమే గుర్తొస్తుంది. అయితే అదంతా గతం. ఇప్పుడు ఫ్యాక్షన్ దాదాపు కనుమరుగైపోయింది. కొత్తతరం వచ్చేసింది. దీంతో ఫ్యాక్షన్ కు దూరంగా ప్రశాంతంగా బతుకుతున్నారు. అనంతసీమలో ప్రశాంతతకోసం పరిటాల సునీత మరో అడుగు ముందుకు వేస్తున్నట్టు సమాచారం.
పరిటాల రవి అనగానే ఫ్యాక్షన్ లీడర్ అనే చెప్తారు ఎవరైనా.! తెలుగుదేశం పార్టీలో అంచలంచెలుగా ఎదిగిన ఆయన ఫ్యాక్షన్ కే బలైపోయారు. మద్దెలచెరువు సూర్యనారాయణ రెడ్డే పరిటాల రవిని చంపించారని భావిస్తారు. పరిటాల కుటుంబానికి, మద్దెలచెరువు సూరి కుటుంబానికి మధ్య ఆధిపత్య పోరు ఉండేది. పరిటాల హత్య తర్వాత మద్దెలచెరువు కూడా అంతర్గత కుమ్ములాటలతో హతమయ్యాడు. అంతటితో ఆ రెండు కుటుంబాల మధ్య వైరం చల్లారింది. ఆ తర్వాత సీమలో ఫ్యాక్షన్ కనుమరుగైపోయింది.
పరిటాల ఇంట్లో చాలా కాలం తర్వాత శుభకార్యం జరగబోతోంది. పరిటాల రవి - సునీతల కుమారుడు శ్రీరామ్ వివాహం అక్టోబర్ 1వ తేదీన స్వగ్రామం వెంకటాపురంలో జరగనుంది. అదే జిల్లాకు చెందిన జ్ఞానవితో శ్రీరామ్ వివాహం జరగనుంది. ఎన్నో ఏళ్ల తర్వాత తన ఇంట్లో జరుగుతున్న శుభకార్యం కావడంతో అంగరంగ వైభవంగా దీన్ని నిర్వహించేందుకు సునీత భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పెళ్లి పనులు మొదలయ్యాయి. జిల్లాలో కనీవినీ ఎరుగని రీతిలో శ్రీరామ్ వివాహాన్ని నిర్వహించాలనేది సునీత ఆలోచన.
ఇప్పటికే శ్రీరామ్ వివాహానికి ఆహ్వానపత్రికలు రెడీ అయ్యాయి. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ లను సునీతతో పాటు శ్రీరామ్ స్వయంగా వెళ్లి ఆహ్వానించారు. ఈ క్రమంలోనే పరిటాల రవి అనుచరులను, సన్నిహితులను, అభిమానులను స్వయంగా వెళ్లి ఆహ్వానిస్తున్నారు సునీత. కేవలం పరిటాల మిత్రులనే కాకుండా శతృవులను కూడా ఆహ్వానించాలని పరిటాల సునీత నిర్ణయించుకున్నట్టు తాజా సమాచారం.
ఇందులో భాగంగా మద్దెలచెరువు సూరి సతీమణి భానుమతిని తన ఇంటికెళ్లి ఆహ్వానించే ఆలోచనలో పరిటాల సునీత ఉన్నట్టు తెలుస్తోంది. సీమ ప్రశాంతంగా ఉండాలేనేది తమ ఉద్దేశమని, కక్షలు కార్పణ్యాలకు దూరంగా కొత్త తరం ఉండాలని సునీత భావిస్తున్నట్టు సమాచారం. అందుకే శతృవును కూడా కలుపుకుని శాంతికి పునాది వేయాలనుకుంటున్నారట. ఒకవేళ సునీత ఇంటికొచ్చి వెడ్డింగ్ కార్డ్ ఇస్తే పెళ్లికి వెళ్లేందుకు తమకేం అభ్యంతరం లేదని భానుమతి కూడా పాజిటివ్ గా ఆలోచిస్తున్నట్టు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూద్దాం.