రాజకీయాల్లో ఎవరూ మన, తన ఉండరు. అవసరాలకు కలిసొచ్చినోళ్లంతా మనోళ్లే.. మన అవసరం తీరిపోతే.. పగోళ్లే! ఇప్పుడు ఇదే ఫార్ములాను ఫాలో అయిపోతున్నారు మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుత బీజేపీ సీనియర్ నేత దగ్గుబాటి పురందేశ్వరి. ఏపీ సీఎం చంద్రబాబుకు ఆమె స్వయానా వదినగారు కూడా. ఇప్పుడు ఆమె 2019 ఎన్నికలపై దృష్టి పెట్టారు. ఆమె ఉన్న బీజేపీలోనే ఆమె పావులు కదుపుతున్నారు. 2019లో ఏపీలో మళ్లీ 2014 ఎన్నికల సీన్ రిపీట్ అవుతుందని కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో బీజేపీ-టీడీపీలు జట్టుగానే ఎన్నికలకు వెళ్లనున్నాయి.
ఈ క్రమంలో పురందేశ్వరి తన మరిది, సీఎం చంద్రబాబును ఇబ్బంది పెట్టాలని, 2014లో ఆయన తనపై చూపించిన వివక్షను ఇప్పుడు తీర్చేసుకోవాలని ఆమె డిసైడ్ అయ్యారని తాజా రాజకీయ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. 2014 ఎన్నికల్లో.. బీజేపీ తీర్థం పుచ్చుకున్న పురందేశ్వరి.. అప్పటి తన సిట్టింగ్ ఎంపీ సీటు విశాఖ కావాలని అధిష్టానం వద్ద ఏకరువు పెట్టారు. అయితే, అప్పట్లో బీజేపీలోనూ టికెట్ల కేటాయింపులో చక్రం తిప్పిన బాబు.. ఆమెకు కావాలనే ఆ సీటు రాకుండా చేశారని సమాచారం.
దీంతో పురందేశ్వరికి ఓటమి ఖాయమని డిసైడ్ అయిన కడప జిల్లా రాజంపేట ఎంపీ సీటును కేటాయించారు. తనకు ఇలా అన్యాయం జరగడానికి చంద్రబాబే కారణమని పలుమార్లు పురందేశ్వరి ఆఫ్ది రికార్డుగా వాపోయింది. అందుకే అవసరం వచ్చిన ప్రతిసారీ.. బాబును ఏకేయడానికి రెడీ అయ్యేవారు. ఇక, ఇప్పుడు ఆమెకు కూడా ఛాన్స్ వచ్చింది. 2019 ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో తనకు హిందూపురం టికెట్ కావాలని ఆమె బీజేపీ అధిష్టానం వద్ద పట్టుపడుతున్నట్టు తెలుస్తోంది.
హిందూపురం టీడీపీకి కంచుకోట లాంటి సీటు. దీంతో బాబు ఇస్తారా? అంటే మిత్ర పక్షం ఒత్తిడి మేరకు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈ రకంగా బాబును ఇరుకున పెట్టి.. తన కసి తీర్చుకునేందుకు పురందేశ్వరి సిద్ధమైనట్టు సమాచారం. ఒకరకంగా చంద్రబాబుకు ఈ సీటును ఇవ్వలంటే పెద్ద తలనొప్పే. ఎప్పటి నుంచో అచ్చొచ్చిన ఈ స్థానాన్ని బీజేపీకి అప్పగించేయడం ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు. అయినా కూడా మిత్రపక్షం కాబట్టి బీజేపీ మాటను తోసిపుచ్చలేరు. సో,.. ఇలా పురందేశ్వరి తన కసి తీర్చుకుంటారని భావిస్తున్నారు.
ప్రస్తుతం అక్కడ టీడీపీ నుంచి బీసీ వర్గానికి చెందిన నిమ్మల కిష్టప్ప ఎంపీగా ఉన్నారు. అక్కడ ఆయన్ను తప్పించాలంటే బీసీల్లో యాంటీ వస్తుంది. ప్రస్తుతం ఆయన వచ్చే ఎన్నికల్లో పెనుగొండ ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నారు. అయితే అలా చేయాలంటే పెనుగొండలో బీసీ ఎమ్మెల్యేగా ఉన్న పార్థసారథిని తప్పించాలి. ఇక వచ్చే ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్, సునీత ఇద్దరూ పోటీ చేస్తామని తమకు రాఫ్తాడుతో పాటుపెనుగొండ సీటు కూడా కావాలని అంటున్నారు. ఇక్కడే బాబుకు ఇన్ని చిక్కులు ఉంటే ఇప్పుడు పురందేశ్వరి హిందూపురం ఎంపీ సీటు మీద కన్నేసి బాబు ఏం చేయాలో తెలియని డిఫెన్స్లో పడిపోయేందుకు కారణమవుతున్నారని టాక్.