ఏపీలో అధికార టీడీపీలోనే ఉన్న 16 మంది ఎమ్మెల్యేలకు పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు చుక్కలు చూపిస్తున్నారట. మరి ఈ 16 మందికే బాబు ఎందుకు చుక్కలు చూపిస్తున్నారన్న మ్యాటర్లోకి వెళితే వీరంతా వైసీపీ నుంచి వచ్చిన జంపింగ్ ఎమ్మెల్యేలు కావడం విశేషం. వైసీపీ టిక్కెట్పై గెలిచి టీడీపీలోకి జంప్ అయిన 21 మంది ఎమ్మెల్యేల్లో నలుగురికి మాత్రం చంద్రబాబు మంత్రి పదవులు ఇచ్చారు. వారి పరిస్థితి ఓకే. ఇక నంద్యాలలో ఎలాగూ కోట్లాది రూపాయలు డంప్ చేయడంతో అక్కడ భూమా బ్రహ్మానందరెడ్డికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక మిగిలిన 16 మంది ఎమ్మెల్యేలకు మాత్రం అటు నియోజకవర్గాల్లో ప్రజలు, పాత టీడీపీ క్యాడర్ నుంచి ఓ వైపు, ఇటు చంద్రబాబు నుంచి మరోవైపు మద్దెలదరువు తప్పడం లేదట.
పైన చెప్పుకున్న ఐదుగురు ఎమ్మెల్యేలను మినహాయిస్తే పార్టీ మారిన మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్చార్జ్ల పెత్తనమే కొనసాగుతోందట. ఈ విషయంలో చంద్రబాబు సైతం నేనే చూసుకుంటానేలే అని ఎమ్మెల్యేలకు సర్దిచెప్పినా అభివృద్ధి పనులు, నియోజకవర్గాలకు నిధుల కేటాయింపులో ఇన్చార్జ్ల హవా నడుస్తుండడంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు తాము డమ్మీలమా ? అని బాబుపై బాహాటంగానే తమ అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు.
ఇక వీరికి ప్రజల నుంచి కూడా చీత్కారాలు తప్పడం లేదట. గత ఎన్నికల్లో వైసీపీ తరపున ఓట్లు అడిగారు... ఫ్యాన్ గుర్తు పట్టుకు తిరిగి, ఇప్పుడు జెండా మార్చి సైకిల్ గుర్తు పట్టుకుని తిరుగుతున్నారేంటి ? అని ఓపెన్గానే ప్రశ్నిస్తుండడంతో వీరంతా వాళ్లకు ఏం సమాధానం చెప్పాలో ? తెలియక సతమతమవుతున్నారట. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పాత, కొత్త నాయకుల మధ్య అస్సలు పడడం లేదు.
జమ్మలమడుగు, అద్దంకి, కదిరి, గిద్దలూరు, కందుకూరు, పాతపట్నం, పామర్రు ఇలా ఎక్కడ చూసినా నియోజకవర్గాల ఇన్చార్జ్లకు, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అస్సలు పడడం లేదు. ఇక ఈ 16 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్చార్జ్లే ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేలు కేవలం ఉత్సవ విగ్రహాలగా మారిపోయారన్న విమర్శలు కూడా విన్పిస్తున్నాయి.
కదిరిలో చాంద్ భాషాను పక్కన పెట్టి ఆ నియోజకవర్గ ఇన్ ఛార్జి కందికుంట వెంకటప్రసాద్ అంతా తానే అయి చూసుకుంటున్నారు. ఇక అద్దంకిలోనూ గొట్టిపాటి రవికుమార్ ఒకవైపు తిరుగుతుండగా, కరణం బలరాం తనయుడు కరణం వెంకటేశ్ మరోవైపు పర్యటనలు చేస్తున్నారు. పామర్రులో ఉప్పులేటి కల్పన ఓ వైపు తిరుగుతుంటే, వర్ల రామయ్య కూడా మరోవైపు తిరుగుతున్నారు.
జమ్మలమడుగులోను అంతే ఇలా చెప్పుకుంటూ పోతే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు అటు ప్రజల నుంచి చీత్కారాలు, ఇటు నియోజకవర్గాల ఇన్చార్జ్లతో పొసగకపోవడం, అటు మంత్రులు, సీఎం చంద్రబాబు పట్టించుకోకపోవడం, చివరకు నిధుల కేటాయింపులోను తీవ్ర వివక్ష ఎదురు కావడంతో ఇప్పుడు వారాంతా చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. పార్టీలోకి వచ్చేటప్పుడు పెత్తనం మొత్తం మీదే అని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు తమకు ఇంత అన్యాయం జరుగుతున్నా పట్టించుకోవడం లేదని వారు ఫైర్ అవుతున్నారు. ఈ కుంపట్లను ఆయన చల్లార్చకపోతే వచ్చే ఎన్నికల వేళ ఇవి పార్టీకి తీరని నష్టం చేకూరుస్తాయనడంలో సందేహం లేదు.