అద్భుతమైన పరిపాలనా దక్షత కలిగిన నేతగా చంద్రబాబుకు పేరుంది. రాజకీయ నాయకుడిగా కంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ గానే ఆయన వ్యవహారశైలి ఉంటుందని అందరూ చెప్పే మాటే. సాక్షాత్తూ ఐఎఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఇదే మాట చెప్తారు. అయితే 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన స్టైల్ పూర్తిగా మారిపోయింది. కంప్లీట్ రాజకీయ నాయకుడిలా మారిపోయారు. సంక్షేమం బాట పట్టారు. అయితే.. ఇప్పుడు మళ్లీ ఆయన సీఈవో అవతారం ఎత్తబోతున్నారని సమాచారం.
గతంలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న చంద్రబాబు అధికారులను నిద్రపోనిచ్చే వారు కాదు.. తాను కూడా నిద్రపోయేవారు కాదు. చంద్రబాబు పేరెత్తితేనే అందరూ హడలిపోయేవారు. రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్లాలనే తపనతో టెక్నాలజీకి పెద్దపీట వేశారు. సంక్షేమాన్ని పెద్దగా పట్టించుకోలేదు. దీంతో అధికారులు, ఉద్యోగుల నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్నారు. నేల విడిచి సాము చేస్తున్నారనే ఉద్దేశంతో ప్రజలు కూడా ఓడించారు.
అయితే 2014లో చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చారు. అప్పటి నుంచి ఆయన పూర్తిగా మారిపోయారు. సంక్షేమానికి పెద్ద పీట వేశారు. అడగకపోయినా కొత్త పథకాలను చేపట్టి ప్రజలకు చేరువయ్యారు. అడిగిందే తడవుగా నిధులు ఇచ్చేస్తున్నారు. పుట్టుక నుంచి చావు వరకూ ఆదుకుంటున్న ఏకైక ప్రభుత్వం తమదేనని చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. ఇదే విషయాన్ని ఇంటింటికీ తెలుగుదేశంలో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని చంద్రబాబు ఆదేశించారు.
నంద్యాల, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల విజయం తర్వాత చంద్రబాబులో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. వచ్చే ఎన్నికల్లో కూడా గెలుపు తమదేననే ధీమాతో ఉన్నారు. అయితే తాను అనుకున్నంత స్థాయిలో సంతృప్తి రావట్లేదని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అందుకే పలు మార్గాల్లో సర్వేలు చేయిస్తున్నారు. సంతృప్తి స్తాయి పెంచాలనేది ఆయన ఆలోచన. తాను ఎంత కష్టపడుతున్నా కిందిస్థాయి నేతలు, అధికారుల్లో మాత్రం అలసత్వం ఆవహించిందనేది సీఎం ఫీలింగ్.
అధికారులు, కిందిస్థాయి నేతల్లో అలసత్వాన్ని పారదోలడానికి అవసరమైతే మరోసారి సీఈవోలా వ్యవహరించాలని, పాత చంద్రబాబులా మారాలని సీఎం ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. మూడున్నరేళ్లుగా పద్ధతి మార్చుకోవాలని చెప్తున్నా.. ఇప్పటికీ వ్యవహారశైలి మార్చుకోని వారిపై కొరడా ఝళిపించాలని ఆయన అనుకుంటున్నారట. మరి ఎవరికి మూడిందో ఏమో.. చూడాలి మరి.!