రాయలసీమలో ప్రస్తుతం ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల పరిస్థితి ఇప్పుడు హడావుడిగా మారిపోయింది. 2019లో ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. దీంతో వీరి ఆలోచనలు ఒక్కసారిగా మారిపోయాయి. తమ నియోజకవర్గాల పరిస్థితి ఏంటి? తమ గెలుపు మంత్రం ఎలా పనిచేస్తుంది ? వచ్చే ఎన్నికల్లో హవా ఎలా ఉండబోతోంది? వంటి కీలక అంశాలతోపాటు తమ వారసుల అరంగేట్రంపైనా నేతలు తల పట్టుకున్నారు. సిట్టింగులుగా తమను తాము గెలిపించుకోవడంతోపాటు వారసులను గెలిపించడం ఇప్పుడు ఈ నేతలకు పెద్ద వ్యవహారంగా మారింది. ఈ క్రమంలోనే వీరు పక్క నియోజకవర్గాలపై దృష్టి పెట్టారు. తమ సీట్లు తాము కాపాడుకుంటూనే.. తమ వారసుల కోసం పక్క నియోజకవర్గాలను ఎంచుకుంటున్నారు. దీంతో కథ ఇప్పుడు రసకందాయంలో పడుతోంది. అదేంటో చూద్దాం పదండి.
పరిటాల సునీత.. ప్రస్తుతం ఈమె ఏపీలో మంత్రిగా ఉన్నారు. తమ ఏకైక కుమారుడు, రాజకీయ వారసుడు పరిటాల శ్రీరాంకి వచ్చే నెలలో పెళ్లి చేస్తున్నారు. అంతేకాదు, వచ్చే 2019 ఎన్నికల్లో అతడిని ఎమ్మెల్యేగా చూసుకోవాలని మంత్రిగారు ప్లాన్ చేస్తున్నారు. దీనికోసం ఆమెకు ఒక నియోజకవర్గం కావాలి. ఈ క్రమంలో అనంతపురం అర్బన్లో కొంత ప్రయత్నాలు చేశారు. అక్కడ ప్రభాకర్ చౌదరి గట్టిగా నిలబడటంతో.. మంత్రిగారు డీలా పడ్డారు. దీంతో ధర్మవరం నియోజకవర్గంపై సునీత దృష్టి పెట్టారు. అక్కడ తన భర్త రవి పార్టీ కోసం ఎంతో చేశాడని.. అందుకే, ఆ నియోజకవర్గం తమది అని ఆమె ఇప్పటికీ నమ్ముతారు. ఈ క్రమంలోనే వరదాపురం సూరితో ఇప్పటికీ ఆమె తగువులు పడుతూనే ఉన్నారు. అయితే, చంద్రబాబు మద్దతు.. సిట్టింగ్ ఎమ్మెల్యేకే దక్కింది. దీంతో సునీత వర్గం ధర్మవరంపై ఆశలు వదిలేసుకుంది.
ఇక పెనుకొండ.. రాప్తాడు నియోజకవర్గాలపైనా సునీత కన్నేశారు. పెనుకొండలో జెండా పాతాలనేది సునీత కల. అదేవిధంగా రాప్తాడు కూడా తమ అధీనంలోనే ఉండాలనేది సునీత లెక్క. ఈ క్రమంలో ఈ నియోజకవర్గాల్లో ఏదో ఒక స్థానం నుంచి శ్రీరాంను పోటీ నిలబెట్టాలని సునీత భావిస్తున్నారు. ఇక, మరో నేత నిమ్మల కిష్టప్ప కూడా తన తనయుడిని రాజకీయాల్లోకి దింపాలని ప్రయత్నిస్తున్నారు. పుట్టపర్తి, పెనుకొండ నియోజకవర్గాలను ఆయన పరిశీలిస్తున్నారు. అవసరమైతే హిందూపురం ఎంపీ సీటును త్యాగం చేసేందుకు కూడా సిద్ధంగానే ఉన్నారట. ఈ క్రమంలోనే అక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఆయన డిస్ట్రబ్ చేస్తున్నాడనే మాట వినిపిస్తోంది.
అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తన ఎంపీ సీటు, తాడిపత్రి ఎమ్మెల్యే సీటుతో పాటు.. శింగనమల, అనంతపురం అర్బన్ వంటి నియోజకవర్గాల్లో తన కుటుంబీకులు లేదా.. తను చెప్పిన వాళ్లే నిలబడాలని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తమ వారసుడిని తన నియోజకవర్గం నుంచే నిలబెట్టేలా ఆయన పావులు కదుపుతున్నారు. ఇక కర్నూలు జిల్లా విషయానికి వస్తే.. ఇక్కడా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఎంపీ టీజీ వెంకటేష్ తనయుడు రంగంలోకి దిగాడు. నంద్యాల ఎంపీ నియోజకవర్గంపై ఆయన కన్నేసినట్టు తెలుస్తోంది. మరి రాబోయే ఎన్నికల్లో ఎన్ని ట్విస్టులు ఎదురవతుతాయో చూడాలి.