ఏపీలో తెలుగుదేశం పార్టీలోకి వద్దంటే వలస నాయకులు వచ్చేస్తున్నారు. ఇప్పటికే విపక్ష వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు 21 మంది, ఇద్దరు ఎంపీలు, కొందరు ఎమ్మెల్సీలతో పాటు స్థానిక సంస్థలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు కూడా పార్టీ జంప్ చేసి టీడీపీలోకి వచ్చేశారు. కానీ పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో ప్రాంతం టీడీపీలో ఉండమని బ్రతిమిలాడుతున్నా ఎవ్వరూ ఉండేలా లేరు.
గత ఎన్నికల్లో తెలంగాణ నుంచి గెలిచిన 15 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీలో ఇప్పుడు పార్టీలో కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఇక మిగిలిన సీనియర్ నాయకులు కూడా ప్రస్తుతం టీటీడీపీలో ఉన్నవారిని వేళ్లమీద లెక్కెట్టేయొచ్చు. పార్టీకి తెలంగాణలో ఫ్యూచర్ లేకపోవడంతో వీళ్లంతా కట్టకట్టి ఇతర పార్టీల్లోకి జంప్ చేసేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు టీడీపీ సీనియర్ నేత, ప్రముఖ పారిశ్రామికవేత్త, టీడీపీ అధినేత చంద్రబాబుకు రైట్ హ్యాండ్స్లో ప్రముఖుడు, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు కూడా పార్టీ జంప్ చేసేందుకు రెడీ అయ్యారట.
గత రెండు దశాబ్దాలుగా ఖమ్మం జిల్లా టీడీపీ రాజకీయాల్లో పెద్ద తలకాయగా ఉన్న ఆయన వచ్చే ఎన్నికల్లో కూడా ఎంపీగా పోటీ చేసేందుకు రెడీగా ఉన్నారు. అయితే టీడీపీకి తెలంగాణలో ఫ్యూచర్ లేదని డిసైడ్ అయిన ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పేసి కాషాయ కండువా కప్పుకోవాలని భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఆయన ఖమ్మం ఎంపీ సీటు నుంచి బీజేపీ తరపున పోటీ చేయాలని భావిస్తున్నారు.
స్టేట్ డివైడ్ అయ్యాక ఎంతోమంది సీనియర్ నాయకులు పార్టీని వదిలేసినా నామా మాత్రం పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని నామాపై ఒత్తిడి పెరుగుతోందట. ప్రస్తుతం ఆయన టీడీపీలోనే ఉన్నా ఎక్కడా యాక్టివ్గా కనిపించడం లేదు. ఇక బాబుకు తాను రైట్ హ్యాండ్ అయినా బాబు ఏపీ రాజకీయాలకు పరిమితమైపోవడంతో నామా ఇప్పుడు తన దారి తాను వెతుక్కోకతప్పడం లేదు.
వచ్చే ఎన్నికల్లో ఖమ్మం ఎంపీగా పోటీ చేయాలని భావిస్తోన్న నామా తాజాగా ఖమ్మం ఎంపీ పరిధిలో టీడీపీ పరిస్థితిపై సర్వే చేయించగా టీడీపీ పరిస్థితి ఏ మాత్రం బాగోలేదని రిపోర్ట్ వచ్చిందట. అయితే వ్యక్తిగతంగా నామాకు మంచి మార్కులే వచ్చాయట. దీంతో ఆయన టీడీపీ కంటే తెలంగాణలో పుంజుకుంటోన్న బీజేపీలోకి వెళితే ఫ్యూచర్ ఉంటుందని భావించి ఆ పార్టీలోకి జంప్ చేయాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. నామాను చేర్చుకునేందుకు బీజేపీ నేతలు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఆయన వస్తానంటే రెడ్ కార్పెట్ పరిచేందుకు రెడీ అవుతారనే చర్చ సాగుతోంది.