నంద్యాల,కాకినాడ ఉప ఎన్నికల తర్వాత వైసీపీ అధినేత జగన్ వేస్తోన్న ఎత్తులు ఎవ్వరికి అర్థం కావడం లేదు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని ఓడించేందుకు, తనను బాగా టార్గెట్ చేస్తోన్న వారికి సైతం ఆ ఎన్నికల్లో ఓడించేందుకు జగన్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు పార్టీకి మంచివే అయినా మరికొన్ని మాత్రం కొన్ని నిర్ణయాలు కొందరిని హర్ట్ చేస్తున్నాయి. అసెంబ్లీలోను, బయటా తనను పదే పదే టార్గెట్ చేస్తోన్న మంత్రి అచ్చెన్నాయుడను టెక్కలిలో టార్గెట్ చేసేందుకు ప్రస్తుతం ఉన్న ఇద్దరు నియోజకవర్గ కో ఆర్డినేటర్లకు తోడుగా మాజీ మంత్రి కిల్లి కృపారాణిని సైతం జగన్ పార్టీలోకి తీసుకుని అదే నియోజకవర్గం బాధ్యతలు అప్పగిస్తున్నారు.
ఇక సొంత జిల్లాలో తనకు కంట్లో నలుసులా మారిన మంత్రి ఆదినారాయణరెడ్డికి షాక్ ఇచ్చేందుకు జగన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు బాబాయ్ వివేకాకు షాక్ ఇచ్చేలా ఉంది. వైఎస్ అండతో రాజకీయంగా ఎదిగిన ఆదినారాయణరెడ్డి గత ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్పై గెలిచి ఆ తర్వాత టీడీపీలోకి జంప్ చేసేశారు. కేబినెట్ ప్రక్షాళనలో ఆదికి చంద్రబాబు మంత్రి పదవి కూడా ఇచ్చారు. కేవలం జగన్ను సొంత జిల్లాలో టార్గెట్ చేసే క్రమంలోనే చంద్రబాబు ఆదికి బాగా ప్రయారిటీ ఇస్తున్నారు.
నంద్యాల ఉప ఎన్నికల్లో కూడా ఆది వైసీపీని ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డారు. ఈ క్రమంలోనే తనకు పలు విధాలుగా దెబ్బేస్తోన్న ఆదిని ఓడించేందుకు జగన్ తీసుకున్న డెసిషన్ ఇప్పుడు ఆయన బాబాయ్ వైఎస్.వివేకాకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోందట. కడప స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి చేతిలో ఓడిపోయిన వైఎస్ వివేకా… వచ్చే ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నారు.
జగన్ సైతం తన సోదరుడైన అవినాష్ రెడ్డిని తప్పించి వివేకాను కడప ఎంపీ సీటు ఇస్తానని కూడా వివేకాకు చెప్పారట. దీంత వివేక వచ్చే ఎన్నికల్లో ఎంపీ సీటుపై ఆశతో ఉన్నారు. అయితే మధ్యలో ఏం జరిగిందో గాని ఆదినారాయణరెడ్డిని ఓడించాలని గట్టిగా డిసైడ్ అయిన జగన్ వివేకాను కడప ఎంపీగా బదులు మంత్రి ఆదినారాయరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న జమ్మలమడుగు నుంచి పోటీ చేయించాలని నిర్ణయించుకున్నారట. ఈ నిర్ణయాన్ని జగన్ నేరుగా వివేకాకు చెప్పకపోయినా తన సన్నిహితులతో చెప్పించారట. దీంతో ఇప్పుడు వివేకా జగన్పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది.
జమ్మలమడుగులో ఆదినారాయణరెడ్డి బలంగా ఉన్నారు. ఇప్పటికే జగన్ను నమ్ముకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోయిన వైఎస్.వివేకా ఇప్పుడు మరోసారి జమ్మలమడుగులో రిస్క్ చేసేందుకు సిద్ధంగా లేరట.తాను జమ్మలమడుగులో ఓటీ చేయాలన్న విషయాన్ని జగన్ తనతో నేరుగా చెప్పకుండా వేరే వ్యక్తులతో చెప్పించడంతో ఆయన తీవ్ర అసహనంతో ఉన్నారట. కడప ఎంపీ సీటుపై హామీ ఇచ్చి ఇప్పుడు జమ్మలమడుగులో పోటీ చేయమని చెప్పడం ఎంత వరకు సమంజసమని ఆయన ఫైర్ అవుతున్నారని తెలుస్తోంది. ఏదేమైనా జగన్ డెసిషన్ ఇప్పుడు బాబాయ్ వర్సెస్ అబ్బాయ్ మధ్య గ్యాప్కు కారణమైంది.