నంద్యాల, కాకినాడ ఎన్నికల ఫలితాల తర్వాత.. ప్రతిపక్ష వైసీపీ నుంచి వలసలు పెరుగుతాయని టీడీపీ నాయకులు ధీమాగా చెబుతున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ ప్రారంభమవుతుందని అంతా స్పష్టంచేస్తున్నారు. ఇందుకు సంబంధిం చిన వ్యవహారాలు టీడీపీ అధినేత చంద్రబాబు మొదలుపెట్టారా? ఈ బాధ్యతలను కూడా ఫిరాయింపు ఎమ్మెల్యే, మంత్రి అమర్నాథ్రెడ్డికి అప్పగించారా? ఆయనే ఈ ఫిరాయింపు శాఖకు మంత్రిగానూ వ్యవహరిస్తున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. విపక్షాన్ని బలహీన పరిచే బాధ్యతతోపాటు పార్టీలోకి కొత్తవారిని తీసుకొచ్చే బృహత్తర వ్యూహాన్ని కూడా ఆయనకే అప్పగించారట చంద్రబాబు!!
ఫిరాయింపు నేతలకు సీఎం చంద్రబాబు సరికొత్త బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఎవరికివారు పార్టీలో తమ ఉనికిని పటిష్టం చేసుకునే క్రమంలో ఉండగా.. ఇప్పుడు ఫిరాయింపు నేతలు కూడా ఇదే పనిలో పడ్డారు. అలాంటి నేతల్లో అమర్ నాథ్ రెడ్డి కూడా ఒకరు. నంద్యాల ఉప ఎన్నిక తరుణంలో ఆయన క్రియాశీల పాత్ర పోషించారు. తనవంతు చేయాల్సిన కృషి చేశారు! ఇప్పుడు కూడా ఆ కృషిని కొనసాగిస్తున్నారు! ఇందులో భాగంగా విపక్షం వైకాపా నుంచి నాయకుల్ని ఆకర్షించడంతో పాటు సీఎం చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పించడం! వైసీపీకి చెందిన పీలేరు జెడ్పీటీసీ సభ్యుడు మల్లారెడ్డి భాషాని టీడీపీలో చేర్చారు. అమర్ నాథ్ రెడ్డి నివాసంలోనే ఇది జరిగింది.
జిల్లాలోని జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు మరింతమంది టీడీపీలోకి వచ్చే ప్రయత్నం జరుగుతోందనీ, రాబోయే రెండు నెలల్లో పెద్ద ఎత్తున పార్టీలో చేరికలు ఉంటాయని మంత్రి అమర్ నాథ్ చెప్పడం వెనుక పెద్ద కథే నడుస్తోందట.పీలేరు నియోజకవర్గంలో ఇప్పటికే ఇద్దరు కీలక వైకాపా నేతలు వైకాపాను వీడారనీ, రాబోయే రోజుల్లో ఈ నియోజక వర్గంపై టీడీపీ మరింత పట్టు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రి అమర్ నాథ్ రెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు నానితో కలిసి మరింతమంది వైకాపా నేతలతో మంతనాలు సాగిస్తున్నట్టు చెబుతున్నారు.
పీలేరు నియోజక వర్గంలోని వైకాపా ముఖ్యనేతలతోపాటు, జిల్లాలోని ఇతర నాయకులతో కూడా అమర్ నాథ్ రెడ్డి టచ్ లోకి వెళ్తున్నారట. రాబోయే రెండు నెలల్లో మరింతమందిని టీడీపీలోకి ఆహ్వానించాలనే లక్ష్యంతో ఆయన బిజీబిజీగా ఉన్నారని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఇక్కడ అమర్నాథ్రెడ్డికి బాబు ఈ కీలక బాధ్యతలు అప్పగించడం వెనక పెద్ద కథే ఉంది. చంద్రబాబు సొంత జిల్లాలో కూడా గత ఎన్నికల్లో వైసీపీ ఆధిపత్యం చెలాయించింది. మెజార్టీ ఎమ్మెల్యేలను వైసీపీ గెలుచుకుంది. కనీసం వచ్చే ఎన్నికల్లో అయినా ఇక్కడ పట్టు సాధించాలన్న కసితో ఉన్న బాబు ఇక్కడ వైసీపీ నుంచి పెద్ద ఎత్తున ఫిరాయింపుదారులను పార్టీలో చేర్చుకునే బాధ్యతను అమర్నాథ్రెడ్డికి అప్పగించారు. మరి అమర్నాథ్రెడ్డి.. కొత్త బాధ్యత విజయవంతంగా నిర్వహించేస్తున్నారు!!