తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పొత్తు ఉంటుందా..? ఉండదా..? అనేదానిపై ఉత్కంఠ కలిగిస్తోంది. 2019లో జరగాల్సిన ఎన్నికలు వచ్చే ఏడాది చివరిలోనే జరుగుతాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏఏ పార్టీల మధ్య పొత్తు ఉండబోతోంది.. ముఖ్యంగా జనసేన ఎవరితో కలిసి ముందుకెళ్తుందనేది ఆసక్తిగా మారింది.
వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగబోతున్నట్టు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. అంతేకాకుండా తాను కూడా స్వయంగా అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తానన్నారు. అందులో భాగంగానే జనసేన ఇటీవల స్పీడ్ పెంచింది. ఇప్పటివరకూ ప్రచారకర్తల ఎంపికలో నిమగ్నమైన జనసేన పెద్దలు ఇప్పుడు సభ్యత్వ నమోదుపై దృష్టి పెట్టారు. త్వరలోనే ఆన్ లైన్ ద్వారా సభ్యత్వ నమోదు చేపట్టాలని నిర్ణయించారు.
అక్టోబర్ నుంచి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రానున్నట్టు పవన్ కల్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో జనసేనకు కొత్త ఊపు రానుంది. ఇన్నాళ్లూ కేవలం ఇష్యూలపై మాత్రమే పవన్ స్పందించి వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. మరిప్పుడు నేరుగా రంగంలోకి దిగితే ఆయన యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుందనేది చూడాలి. అయితే జనసేన బలోపేతంపైనే పవన్ ఈసారి ఎక్కువగా దృష్టిపెడతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
జనసేనతో ఏ పార్టీ జతకడుతుంది.. జనసేన ఎవరితో కలిసి ముందుకెళ్లే అవకాశం ఉంది.. అనే ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాపిక్. టీడీపీ మాత్రం జనసేనతో తమతో కలిసి వస్తుందని ధీమాగా ఉంది. గత ఎన్నికల్లో టీడీపీ – బీజేపీ కూటమి తరపున పవన్ కల్యాణ్ ప్రచారం చేశారు. ఈసారి పార్టీ పెట్టడంతో ఆయన తమతో కలిసి వస్తారని తెలుగు తమ్ముళ్లు నమ్ముతున్నారు. 2014 తర్వాత కూడా పవన్.. ప్రభుత్వంతో సఖ్యతగానే ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
2014 ఎన్నికల తర్వాత పవన్ కల్యాణ్ టీడీపీ – బీజేపీతో సఖ్యంగానే ఉన్నారు. అయితే ప్రత్యేక హోదాపై బీజేపీ వైఖరిని పవన్ ఎండగట్టారు. అదే సమయంలో టీడీపీ ఎంపీలు సరిగా పోరాడలేదని ధ్వజమెత్తారు. అయితే చంద్రబాబును మాత్రం ఒక్క మాట కూడా అనలేదు. పైగా రాష్ట్రం కోసం ఆయన శ్రమిస్తున్నారని, మిగిలిన నేతలు మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. అదే సమయంలో చంద్రబాబు కూడా పవన్ ఎన్ని మాటలన్నా ఆయన్ను విమర్శించవద్దని శ్రేణులకు స్పష్టమైన సంకేతాలిచ్చారు.
పవన్ లేవనెత్తే ప్రతి అంశంపైనా ప్రభుత్వం వెంటనే స్పందిస్తోంది. ఇటీవల అగ్రికల్చరల్ విద్యార్థులకు సంబంధించి జీవో 64ను రద్దు చేయాలని పవన్ డిమాండ్ చేసిన వెంటనే ప్రభుత్వం ఆ పని చేసింది. అంతకుముందు ఉద్దానం కిడ్నీ సమస్యపై మాట్లాడగానే.. పవన్ ను సెక్రటేరియేట్ కు ఆహ్వానించి సాక్షాత్తూ చీఫ్ సెక్రటరీతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పించింది. పవన్ కూడా ప్రభుత్వ తీరుపై సంతృప్తిగానే ఉన్నారు.
బీజేపీతో విభేదించినా, తమతో సఖ్యతగానే ఉన్నందున జనసేన తమతోనే కలసివస్తుందనే నమ్మకం టీడీపీలో కనిపిస్తోంది. అయితే జనసేన మాత్రం ఇప్పటివరకూ పొత్తులపై ఆలోచించలేదని, పార్టీని పటిష్టపరచడంపైనే దృష్టి పెట్టామని చెప్తోంది. మరి ఈ పొత్తుల వ్యవహారం తేలాలంటే మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందే.!