తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కవిత ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ నియోజకవర్గంలో ప్రస్తుతం రాజకీయ వాతావరణం బాగా హీటెక్కింది. సమైక్యాంధ్రలో పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా పనిచేసిన దిగ్గజ రాజకీయ వేత్త డి.శ్రీనివాస్ గత ఎన్నికల్లో ఓటమి అనంతరం టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ముందుగా ఆయనకు కేబినెట్లో కీలక ర్యాంక్ పదవి ఇచ్చిన కేసీఆర్ ఆ తర్వాత రాజ్యసభకు పంపారు. అయితే ఇప్పుడు ఆయన తనయుడు కాషాయ కండువా కప్పుకోవడంతో నిజామాబాద్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కేశాయి.
అంతే కాదు కేంద్ర బీజేపీ పెద్దలు కూడా నిజామాబాద్ను ప్రత్యేకంగా టార్గెట్ చేసే పనిలో ఉండడంతో ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న కవిత ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఓ వైపు కవిత వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా కాకుండా జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి వచ్చే ఎన్నికల తర్వాత స్టేట్లో మంత్రి అవ్వాలన్న ప్లాన్తో ఉన్నారన్న వార్తలు ఇప్పటికే జోరుగా వచ్చేశాయి. దీనికి తోడు ఇక్కడ డీఎస్ కొడుకు వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరపున ఎంపీగా పోటీ చేస్తాడన్న వార్తలతో జిల్లా ప్రజల్లో చర్చలు స్టార్ట్ అయ్యాయి.
డీఎస్ తనయుడు బీజేపీలో చేరిన సభకు కేంద్ర హొం మంత్రి రాజ్నాథ్సింగ్ హాజరు కావడం, జనాలు స్వచ్ఛందంగానే భారీగా తరలి రావడంతో టీఆర్ఎస్ వర్గాల్లో కూడా కాస్త ఆందోళన చెలరేగింది. ఇక డీఎస్ సామాజికవర్గం నుంచి ఎక్కువ మంది ఈ సభకు తరలివెళ్లారన్న నివేదికలు కూడా కవితకు అందాయి. దీనికి తోడు కవిత ఎమ్మెల్యేగా వెళుతుందంటున్నారు...డీఎస్ కొడుకు బీజేపీ తరపున పోటీ చేస్తే ఓ సారి ఓటేద్దామా ? అన్న చర్చలు జనాల్లో స్టార్ట్ అవ్వడంతో కవిత ఒక్కసారిగా ఎలెర్ట్ అయ్యారు.
ఎందుకంటే నిజామాబాద్లో బీజేపీ గతంలో ఒంటరిగా పోటీ చేసి కూడా గెలిచింది. మరోసారి ఆ పార్టీకి ఛాన్స్ ఇవ్వకూడదని టీఆర్ఎస్ భావిస్తోంది. కవిత ఇక్కడ పొలిటికల్ హీట్ను వెంటనే కేటీఆర్ ముందు పెట్టడంతో కవితకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు సోదరుడు కేటీఆర్ రంగంలోకి దిగారు. కవితకు వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేందుకు కేటీఆర్ బీజేపీకి యాంటీగా తన వ్యూహానికి తెరలేపారు. నియోజకవర్గంలో కవితకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు తన శాఖ తరఫున ఫుల్ సపోర్ట్ అందిస్తున్నారు. ఇక ఇతర శాఖల నుంచి కూడా భారీ ఎత్తున నిధులు ఇక్కడ పారించేస్తున్నారు.
నియోజకవర్గంలో బీజేపీ బలపడకుండా ఉండేందుకు,కవితకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు రంగంలోకి దిగిన కేటీఆర్ ఇక్కడ టీఆర్ఎస్ శ్రేణులను ఎలెర్ట్ చేసేశారట. అలాగే కొద్దికాలంగా పెండింగ్లో ఉన్న నిజామాబాద్లో ఐటీ హబ్కు సంబందించిన అంశాన్ని సరిగ్గా ఈ సభ జరిగే రోజే క్లియర్ చేశారు. ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీని విస్తరిస్తున్నామని అందులో భాగంగా నిజామాబాద్లో ఐటీ హబ్ ఏర్పాటు చేసి వేలాది మంది ఉపాధి కల్పించనున్నామని ఆయన తెలిపారు. అలాగే ఇతర శాఖల నుంచి కూడా కేటీఆర్ ఒత్తిడి చేసి మరీ ఇక్కడ నిధుల వరద పారిచేందుకు ప్లాన్ చేశారట. ఏదేమైనా సోదరి కవితకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు కేటీఆర్ వెంటనే రంగంలోకి దిగడం వీరు రాజకీయ ప్రత్యర్థుల విషయంలో ఎంత ఎలెర్ట్గా ఉన్నారో ? చెపుతోంది.