2019 ఎన్నికలు ఏపీలో అప్పుడే హీటెక్కించేస్తున్నాయి. ఎలాగైనా మరోసారి అధికారంలోకి రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తుంటే విపక్ష వైసీపీ అధినేత వైఎస్.జగన్ తొలిసారి సీఎం పీఠం ఎక్కాలన్న కలను నెరవేర్చుకునేందుకు తన ప్రయత్నాలు తాను చేస్తున్నాడు. నంద్యాల, కాకినాడ గెలుపు తర్వాత ఆ జోష్ను కంటిన్యూ చేసే ప్రయత్నాల్లో టీడీపీ ఉంటే, మరోవైపు ఈ రెండు పరాజయాలతో కాస్త డిఫెన్స్లో పడ్డ వైసీపీ కూడా అప్పుడే పట్టు కోసం ప్రయత్నాలు చేస్తోంది.
ఈ క్రమంలోనే నిన్నటి వరకు వైసీపీకి కంచుకోటగా ఉన్న కర్నూలు జిల్లాపై పట్టు కోసం టీడీపీ ప్రయత్నాలు చేస్తుంటే ఉన్న పట్టును నిలుపుకునేందుకు వైసీపీ ట్రై చేస్తోంది. గత సాధారణ ఎన్నికల్లో వైసీపీ జిల్లాలో ఉన్న 11 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లను గెలుచుకుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కేయగా, నంద్యాల ఎంపీ ఎస్పీవై.రెడ్డి కూడా పసుపు కండువా కప్పుకున్నారు. ఇక కర్నూలు ఎంపీ బుట్టా రేణుక సైతం అదేదారిలో ఉన్నట్టు ప్రచారం జోరుగుతోంది.
ఇక కొద్ది రోజులు క్రితం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు ప్రతిష్టాత్మకంగా జరిగిన నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ ఘనవిజయం సాధించడంతో వైసీపీ కంచుకోట కూలుతున్నట్టే కనపడుతోంది. ఇదిలా ఉంటే జిల్లాలో రాజకీయంగా బలమైన కోట్ల ఫ్యామిలీపై ఇప్పుడు రెండు పార్టీలు గురి పెట్టాయి. మాజీ మంత్రి కోట్ల విజయ్భాస్కర్రెడ్డి తనయుడు, మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్రెడ్డి ఫ్యామిలీని తమ పార్టీలో చేర్చుకునేందుకు అటు అధికార టీడీపీ, ఇటు విపక్ష వైసీపీ రెండూ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
కోట్ల ఫ్యామిలీకి కేవలం కర్నూలు జిల్లా మాత్రమే కాకుండా రాయలసీమలోను భారీగా బంధుగణం ఉంది. ఆయన తమ పార్టీలోకి వస్తే ఆ ఎఫెక్ట్ సీమలో అన్ని ప్రాంతాలతో పాటు కర్నూలు జిల్లాలో ఆరేడు నియోజకవర్గాలపై చాలా బలంగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ ఒక్క ఫ్యామిలీకే వైసీపీ 3, టీడీపీ 2 సీట్లు ఆఫర్ చేసినట్టు సమాచారం. టీడీపీలో చేరితే కోట్లకు కర్నూలు ఎంపీ సీటుతో పాటు ఆలూరు ఎమ్మెల్యే సీటు ఆఫర్ చేశారట. ఇక వైసీపీ అయితే కర్నూలు ఎంపీ సీటుతో పాటు ఆలూరు, డోన్, పత్తికొండ ఎమ్మెల్యే సీట్లలో ఆ ఫ్యామిలీ కోరుకున్న రెండు ఎంపీ సీట్లు ఇస్తామని ప్రపోజల్ పెట్టిందట.
రెండు పార్టీలు కోట్లను తమ వైపునకు తిప్పుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నా ఆయన ఏ పార్టీలో చేరతారనేది మాత్రం తెలియడంలేదు. గతంలో కోట్ల సీఎంగా ఉన్నప్పుడు ఆయనపై వైఎస్ చెప్పులు వేయించారన్న టాక్ ఉంది. ఈ అవమానం కోట్ల ఫ్యామిలీ మరువదని..ఈ క్రమంలోనే ఆయన వైసీపీలోకి వెళ్లరని ఓ టాక్ వచ్చింది. ఇక కోట్ల తాజాగా తాను టీడీపీలోకి కూడా వెళ్లనని చెప్పారు. మరో ట్విస్ట్ ఏంటంటే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తనయుడు రాఘవేంద్రరెడ్డి టీడీపీలో చేరేందుకు ఉత్సాహంగా ఉన్నారు. అలాగే కోట్ల సతీమణి, మాజీ ఎమ్మెల్యే సుజాతమ్మ కూడా సుముఖంగా ఉన్నారు. లోకేష్తో రాఘవేందర్రెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయి. మరి ఇన్ని ట్విస్టుల నేపథ్యంలో కోట్ల రూటు ఎలా ఉంటుందో ? చూడాలి.