రాజకీయాల్లో ప్రత్యర్థులను చిత్తు చేయాలంటే సరైన సమయం కోసం వేచిచూడాలి! ఇదే సమయంలో ఒకేసారి నలుగురితో తలపడాలంటే.. అందుకు తగ్గ వ్యూహం కావాలి! దానిని సరైన సమయంలో అమలు చేయాలి!! ఒకవేళ ఆ సమయం రానప్పుడు.. సొంతంగానే కల్పించాలి! ఇప్పుడు ఇదే సమయం కోసం తెలంగాణ సీఎం కేసీఆర్.. వేచి చూస్తున్నారు. ప్రతిపక్షాల మధ్య ఉన్న సఖ్యతను, ఐకమత్యాన్ని దెబ్బతీసే వ్యూహంతో రావాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికలు రూపొందిస్తున్నారు. నల్గొండ ఉప ఎన్నిక నిర్వహించి.. సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. మరి ఆయన వ్యూహాలు ఈసారి ఎలా అమలవుతాయోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటివరకూ కేసీఆర్ వేసిన సామదానబేధదండోపాయలకు చిత్తయిపోయిన ప్రతిపక్షాలు ఐక్యతా రాగం ఆలపిస్తు న్నాయి. సిద్ధాంతాలు పక్కన పెట్టేశాయి. అభిప్రాయబేధాలు అటకెక్కించేశాయి. ఒంటరిగా ఉంటే లాభం లేదనుకుని.. ఐకమత్యమే మహాబలం అంటూ ముందుకు సాగుతున్నాయి. ఏ నిర్ణయమైనా కలిసికట్టుగా తీసుకుంటున్నాయి. మరి ఒక్కొక్కరుగా ఉన్నప్పుడు ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన కేసీఆర్కు.. ఇప్పుడు ప్రతిపక్షాల ఐకమత్యాన్ని చూసి కొంత టెన్షన్ మొదలైందట. అందుకే వీలైనంత త్వరగా వీరి ఐక్యత దెబ్బతీయాలని నిర్ణయించుకున్నారట.
బలమైన కేసీఆర్ ను ఢీ కొని పడగొట్టాలంటే విడి విడి గా సాధ్యం కాదని భావిస్తున్న విపక్షాలు తమ సిద్ధాంతాలు పక్కన పెట్టిసి చేతులు కలుపుతు న్నాయి. బీజేపీ కూడా లోపాయికారీగా టీడీపీ కాంగ్రెస్ లకు సహకారం అందిస్తుంది . ఇక వామపక్షాలు కూడా కాంగ్రెస్, టీడీపీతో జట్టు కట్టాయి. తెలంగాణలో బలంగా ఉందనుకున్న టీఆర్ఎస్ను దెబ్బ కొట్టడానికి విపక్షాలు ఒక్కటై ఆయనపై ముప్పేట దాడి మొదలు పెట్టడాన్ని గులాబీ బాస్ సీరియస్ గా తీసుకున్నారు . సార్వత్రిక ఎన్నికలకు సేనలను సర్వసన్నద్ధం చేసే సమయం రావడంతో.. ఆయన పాలన కన్నా పార్టీపైనే ఎక్కువగా దృష్టిసారిస్తున్నారు.
ప్రతిపక్షాల నడుమ ఐక్యత భగ్నం చేయడం, పార్టీ సామర్ధ్యం పై పరీక్ష పెట్టుకోవడం లక్ష్యంగా కేసీఆర్ నల్గొండ పార్లమెంట్ స్థానానికి ఎన్నికలు ఆహ్వానిస్తున్నారు . సింగరేణి ఎన్నికల్లో అన్ని పార్టీలు ఒక్కటే తమ ఓటమికి చేస్తున్న ప్రయత్నాలు గమనించారు కేసీఆర్. నల్గొండ ఎన్నికల్లో విపక్షాలు ఒక్కటై పోటీ చేయలేవన్నది ఆయన భావన. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ మధ్య నల్గొండ ఎన్నికల్లో దూరం పెరుగుతుందని భావిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రత్యర్థులకు అందని వ్యూహాలు అనుసరిస్తూ అందరిని తన దారిలోకి తెచ్చుకున్న కేసీఆర్ ఇప్పుడు సరికొత్త వ్యూహాలతో పాత స్టైల్ రుచి చూపించే పనిలో పడ్డారట.