అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఎంపీగా ఉండి ప్రజలకు ఏం చేయలేకపోతున్నానని.. అందుకే రాజీనామా చేస్తున్నానని చెప్పారు. వచ్చే బుధవారం ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని వెల్లడించారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడలేదని జేసీ చెప్పారు. అనంతపురం జిల్లా అభివృద్ధికి కొన్ని శక్తులు అడ్డుతగిలాయని ఆవేదన వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన జేసీ దివాకర్ రెడ్డి.. విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు. అదే విషయంపై ఆయన కాంగ్రెస్ అదిష్టానాన్ని ధిక్కరించారు. అయినా కాంగ్రెస్ పార్టీ మొర ఆలకించలేదు. చివరకు రాష్ట్రం విడిపోవడంతో ఆయన టీడీపీలో చేరారు. చంద్రబాబు ఆయనకు అనంతపురం ఎంపీ, సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డికి తాడిపత్రి ఎమ్మెల్యే సీట్లిచ్చారు. వారిద్దరూ గెలుపొందారు.
ముక్కుసూటి మాటలతో ఆకట్టుకునే జేసీ దివాకర్ రెడ్డి తనదైన శైలిలో మాట్లాడుతుంటారు. అధికారపార్టీలో ఉన్నా.. అవసరమైతే చురకలంటించేందుకు ఏమాత్రం వెనుకాడరు. ఇక ప్రతిపక్ష వైసీపీపైన, ఆ పార్టీ అధినేత జగన్ పైన నిప్పులు చెరుగుతుంటారు. మరి ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేసిన తర్వాత ఏం చేస్తారనేది తెలియాల్సి ఉంది.
అయితే వచ్చే ఎన్నికల్లో తాను కాకుండా తన కుమారుణ్ణి రాజకీయరంగప్రవేశం చేయించాలని జేసీ చాలాకాలంగా ఆలోచిస్తూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని, రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నానని గతంలోనే జేసీ ప్రకటించారు. అయితే ఒకటిన్నర ఏడాదికి పైగా పదవీకాలం ఉన్నా.. ఇప్పుడు రాజీనామా చేస్తానని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది.