వైసీపీ అధినేత ప్రతిపక్ష నేత వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే తపనతో పనిచేస్తున్నారు. ఇందుకోసం స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ ను ప్రత్యేకంగా నియమించుకున్నారు. పీకే టీం ఈసారి ఎలాగైనా తనను అధికారంలోకి తీసుకువస్తుందని జగన్ గట్టిగా నమ్ముతున్నారు. అయితే ఆయన మాత్రం తన వ్యవహారశైలిని మార్చుకోవట్లేదు. ఇదే జగన్ కు అతి పెద్ద మైనస్ పాయింట్.
జగన్ ఎప్పుడు మీడియా ముందుకొచ్చినా చెప్పా మొదటి మాట చంద్రబాబు సర్కార్ అవినీతిలో కూరుకుపోయిందని..! మూడేళ్లలో మూడు లక్షల కోట్లకు పైగా అవినీతి జరిగిందని.. ఇటీవలే ఆయన ఓ పుస్తకం కూడా విడుదల చేశారు. ఇటీవల జరిగిన నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో కూడా ఇదే అంశాన్ని జగన్ ప్రచారాస్త్రంగా చేసుకున్నారు. అయితే ఆయన ఎంచుకున్న అవినీతి అస్త్రం ఏమాత్రం సత్ఫలితాలివ్వకపోగా బూమరాంగ్ అయినట్టు అర్థమవుతోంది.
ప్రభుత్వం అవినీతిమయమైపోయిందంటూ జగన్ చేస్తున్న ఆరోపణలపై సొంతపార్టీ నేతలే పెదవి విరుస్తున్నట్టు సమాచారం. అవినీతిలో కూరుకుపోయి వారం వారం జైలుకు వెళ్తున్న జగన్ అవినీతి ఆరోపణలు చేయడమేంటని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఇది దొంగే దొంగ అని అరిచినట్లుందని.. వెంటనే ఇలాంటి చౌకబారు ఆరోపణల నుంచి బయటపడాలని సూచిస్తున్నారు. లేకుంటే పార్టీ మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం ఖాయమని హెచ్చరిస్తున్నారు కూడా.!
అవినీతి ఆరోపణలు చేయడం, ప్రభుత్వం, చంద్రబాబులపై దుమ్మెత్తిపోయడం మానేసి... తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పడం ద్వారా కాస్త ప్రయోజనం ఉంటుందని ఆయన సన్నిహితులు కొందరు ఇటీవల జగన్ కు సూచించారట. ప్రశాంత్ కిశోర్ కూడా ఇదే అభిప్రాయం వెలిబుచ్చినట్టు సమాచారం. అయితే జగన్ తమ సూచనను పాటిస్తారా ... లేదా.. అనేదానిపై వారికే అనుమానాలున్నాయట.
నంద్యాల ఎన్నికల ప్రచారంలో చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చాలని ఉందని జగన్ నోరు జారారు. దాని పరిణామాలు ఏ స్థాయికి తీసుకెళ్లాయో తెలిసిందే. అలా మాట్లాడిన వెంటనే కొంతమంది సన్నిహితులు జగన్ కు అలా మాట్లాడడం తప్పు అని సూచించారట. అయితే అవేవీ పట్టించుకోని జగన్ ఆ మరుసటి రోజే చంద్రబాబుపై మరింత రెచ్చిపోయారు. ఉరితీసినా పాపం లేదన్నారు. దీంతో... ఈయనకు ఏం చెప్పినా ఉపయోగం లేదనే అభిప్రాయానికి అప్పుడే వచ్చేశారట. మరి ఈసారైనా జగన్ మాట వింటారా.. లేదా .. అనేది వేచిచూడాలి.