ఏపీలో నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల తర్వాత ఊపంతా టీడీపీ వైపే ఉంది. పలువురు వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు ఒకరిద్దరు వైసీపీ ఎంపీలు సైతం టీడీపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబుకు ఓ ఎమ్మెల్సీ బిగ్ షాక్ ఇస్తూ వైసీపీలోకి జంప్ చేసేందుకు రెడీగా ఉన్నారన్న వార్తలు ప్రకాశం జిల్లాలో జోరుగా చక్కెర్లు కొడుతున్నాయి.
వాస్తవానికి ప్రకాశం జిల్లా గత 15 ఏళ్లలో కాంగ్రెస్ ఆ తర్వాత వైసీపీకి కంచుకోటగా ఉంది. గత ఎన్నికల్లో కూడా ఇక్కడ జిల్లా పరిషత్ స్థానం, ఎంపీ సీటు, మెజార్టీ ఎమ్మెల్యే సీట్లు వైసీపీ గెలుచుకుంది. ఆ తర్వాత ఆపరేషన్ ఆకర్ష్ నేపథ్యంలో మాత్రం వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలతో పాటు చీరాల నుంచి గెలిచిన ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కూడా టీడీపీలోకి రావడంతో ఇప్పుడు జిల్లాలో టీడీపీ ఆధిపత్యం కొనసాగుతోంది.
ఇదిలా ఉంటే జిల్లాలో బలమైన రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గత ఎన్నికలకు ముందు టీడీపీలోకి జంప్ చేశారు. ఆయనకు చంద్రబాబు ఎంపీ సీటు కేటాయించారు. మాగుంట స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయినా బాబు ఆయనకు సముచిత స్థానం ఇస్తూ ఎమ్మెల్సీ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన కేబినెట్ ప్రక్షాళనలో మంత్రి పదవి ఆశించారు. చంద్రబాబు కూడా ఆయన పేరు పరిశీలించినా చివరి క్షణంలో ఆయనకు పదవి రాలేదు.
మంత్రి పదవి రాకపోవడంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్న ఆయన జిల్లాలో తనకు పార్టీలో జరుగుతోన్న అవమానాలపై రగిలిపోతున్నారు. దామచర్ల జనార్థన్, కరణం బలరాం, సిద్ధా రాఘవరావు లాంటి వాళ్లు తనకు అస్సలు ప్రయారిటీ ఇవ్వకపోవడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే టీడీపీలో బలమైన నాయకుల మధ్య తనను ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో ఆయన ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. టీడీపీలో ప్రయారిటీ లేకపోవడంతో పార్టీని వీడే యోచనలో మాగుంట ఉన్నట్లు జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
మాగుంట అసంతృప్తిని పసిగట్టిన కొందరు వైసీపీ నాయకులు ఆయనతో చర్చలు కూడా జరిపినట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా మాగుంటను బరిలోకి దింపాలని లోటస్పాండ్లో చర్చలు జరుగుతున్నాయని విశ్వసనీయవర్గాల సమాచారం. ఇక టీడీపీలో ఉన్నా తన వర్గానికి, జిల్లాకు ఏం చేయలేకపోతున్నానని బాధపడుతోన్న ఆయన వైసీపీలో చేరితే కొన్ని కండీషన్లతో చేరాలని డిసైడ్ అయినట్టు టాక్. వైసీపీలో ఆయన డిమాండ్లకు హామీ లభిస్తే మాగుంట వెంటనే సైకిల్ దిగేసి వైసీపీ కండువా కప్పుకుంటారని సమాచారం.