ఏపీలో సీఎం చంద్రబాబుకు పాలన మీద కంటే తెలుగు తమ్ముళ్ల గొడవల పరిష్కారానికే చాలా టైం పట్టేలా ఉంది. ఏపీలోని 13 జిల్లాల్లోను తెలుగు తమ్ముళ్ల కుమ్మలాటలను చంద్రబాబు పరిష్కరించలేక చేతులు ఎత్తేస్తున్నారు. కరవమంటే కప్పుకు కోపం.... విడవమంటే పాముకు కోపం అన్న చందంగా ఈ గొడవలు ఉండడంతో చంద్రబాబు మౌనంగా ఉండిపోతుండడంతో నాయకులు మరీ బరితెగించేసి పార్టీ పరువు బజారు కీడ్చేస్తున్నారు. ఈ గొడవల పరంపరలోనే ఇప్పుడు ఓ ఎంపీ వర్సెస్ లేడీ ఎమ్మెల్యే మధ్య వార్తో పార్టీ నిలువునా నష్టపోతోంది.
పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగు తమ్ముళ్లు వీరంగం సృష్టించారు. శుక్రవారం జిల్లా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా ఇన్ ఛార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎంపీ మాగంటి బాబు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పీతల సుజాత వర్గీయులు ఒకరిపై ఒకరు దాడి చేసుకునేంత పని చేశారు. వీరి మధ్య అనుకూల, ప్రతికూల నినాదాలతో సమావేశం దద్దరిల్లింది.
మంత్రులు పితాని సత్యనారాయణ, ప్రత్తిపాటి పుల్లారావుల సమక్షంలోనే గొడవ జరగడంతో వారు ఏ వర్గానికి నచ్చచెప్పలేక మౌనంగా ఉండిపోయారు. సమన్వయ సమావేశంలోనే ఇలా జరగడంతో పార్టీ పరువు బజారున పడింది. ఇక అసలు విషయానికి వస్తే ఎక్కడో డెల్టా ప్రాంతానికి చెందిన పీతల సుజాతకు గత ఎన్నికల్లో చింతలపూడి టిక్కెట్ ఇచ్చారు. ఆమె ఎవ్వరో తెలియకపోయినా మాగంటి వర్గీయులు కష్టపడి ఆమెను గెలిపించారు.
పీతల గెలిచిన వెంటనే మంత్రి పదవి రావడంతో ఆమె తనకంటూ సపరేట్ గ్యాంగ్ను మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే పార్టీ కోసం దశాబ్దాలుగా కష్టపడిన వారిని ఆమె విస్మరిస్తున్నారని ఎంపీ వర్గం ఆరోపిస్తోంది. ఇక తన నియోజకవర్గంలో ఎంపీ జోక్యం ఏంటని పీతల మండిపడుతోంది. ఈ రెండు వర్గాలతో నియోజకవర్గంలో పార్టీ రెండుగా చీలిపోయింది. వీరి గొడవలతో పార్టీ అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు అవుతున్నా ఇంకా ఏఎంసీ చైర్మన్ పదవి నియామకం జరగలేదు.
ఇప్పటికే ఈ రెండు వర్గాలు చంద్రబాబుకు ఎన్నోసార్లు ఫిర్యాదులు చేసుకున్నాయి. చివరకు చంద్రబాబు కూడా ఏం చేయలేక చేతులు ఎత్తేశారు. తాజాగా మొన్న పోలవరం వచ్చినప్పుడు మరోసారి మాగంటి వర్గం సుజాత ఏకపక్ష పోకడలపై ఫిర్యాదు చేసింది. దీంతో సమస్య పరిష్కరించే బాధ్యతను మంత్రులు ప్రత్తిపాటి, పితానికి అప్పగించారు. అయితే ఈ రోజు వారిద్దరి సమక్షంలోనే ఈ రెండు వర్గాలు రెచ్చిపోయాయి.