అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తాను రాజీనామా చేయబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే..! ఎంపీగా తాను ప్రజలకు ఏం చేసే సిచ్యుయేషన్ లో లేనని.., అలాంటి పదవి తనకెందుకనేది జేసీ వాదన. చాగల్లు రిజర్వాయర్ కు నీళ్లు కూడా తీసుకురాలేని తనకు ఈ పదవి అక్కర్లేదని తేల్చేశారు జేసీ. అయితే ఆయన రాజీనామాకు అసలు కారణం వేరే ఉందని తెలుస్తోంది.
జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ ఒలంపిక్ అసోసియేషన్ కు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఎంపీ సీఎం రమేశ్ ఆ సంఘానికి అధ్యక్షుడు. అయితే అసలైన ఆంధ్రప్రదేశ్ ఒలంపిక్ అసోసియేషన్ తమదేనంటూ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ వాదిస్తున్నారు. ఇద్దరు టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, సీఎం రమేశ్ ఎవరికివారు తమదే ఒరిజినల్ అని వాదించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వివాదం కోర్టు పరిధిలో ఉంది.
ఈ వివాదాన్ని పరిష్కరించాలని, అసలైన సంఘం తమదేనని వివరిస్తూ పవన్ రెడ్డి మూడుసార్లు సీఎం చంద్రబాబును కలిశారు. అయితే చంద్రబాబు దీనిపై పట్టించుకోలేదని సమాచారం. పైగా గల్లా జయదేవ్ సంఘానికే మద్దతు పలుకుతూ సీఎం రమేశ్ ను వారించినట్టు తెలుస్తోంది. దీంతో పవన్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. అధినేతతో మొరపెట్టుకుంటే సమస్య సాల్వ్ అవుతుందనుకుంటే .. పరిష్కారం కాకపోవడం, పైగా ప్రత్యర్థికి మద్దతు పలకడంతో జేసీ వర్గం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు అల్లుడు, ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కూడా అసంతృప్తికి మరో కారణం.
వచ్చే ఎన్నికల్లో తాను తప్పుకుని పవన్ రెడ్డిని రాజకీయ రంగప్రవేశం చేయించాలని జేసీ దివాకర్ రెడ్డి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు తీరు తీవ్ర అసంతృప్తి కలిగించిందని.. అందుకే జేసీ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారని ఇంటర్నల్ టాక్. అయితే చాగల్లుకు నీరు ఇవ్వకపోవడం వల్లే రాజీనామా చేస్తున్నట్టు పైకి ప్రకటించారు. ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి నీరు విడుదల చేయడంతో జేసీ మెత్తబడ్డారు. అయితే అసలు సమస్య మాత్రం వేరే.. అది అలాగే ఉంది.