ఏపీ సీఎం చంద్రబాబు ఫుల్ జోష్ లో ఉన్నారు. పరిస్థితులన్నీ తనకు అనుకూలంగానే ఉన్నాయని ఫీలవుతున్నారు. అందుకే ఇదే స్ట్రాటజీ అమలు చేస్తూ ప్రజల్లో అభిమానం పొందడం ద్వారా శాశ్వతంగా అధికారంలో ఉండేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకే చంద్రబాబు టార్గెట్ ఇప్పుడు 2019 మాత్రమే కాదు.. 2024 కూడా...!!
గతంలో పదేళ్లపాటు సీఎంగా ఉన్న చంద్రబాబు నేలవిడిచి సాము చేశారు. టెక్నాలజీ వెంట పరుగులు పెడుతూ కార్పొరేట్ బాటలో నడిచారు. టెక్నాలజీ ద్వారా చాలా సమస్యలకు సొల్యూషన్ దొరుకుతుందని భావించిన చంద్రబాబు సంక్షేమాన్ని పట్టించుకోలేదు. అందుకే ప్రజలు ఆ తర్వాత పదేళ్లపాటు చంద్రబాబును అధికారానికి దూరం చేశారు. ఇదే సమయంలో వై.ఎస్.రాజశేఖరరెడ్డి సంక్షేమంతో ప్రజల మనసులు దోచుకున్నారు.
వై.ఎస్. మరణం, రాష్ట్ర విభజన తర్వాత పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చారు. అప్పటి నుంచి చంద్రబాబు చాలా మారిపోయారు. సంక్షేమాన్ని కొత్తపుంతలు తొక్కిస్తున్నారు. మేనిఫెస్టోలో లేని పథకాలను కూడా ప్రవేశపెట్టి ప్రజలకు చేరువవుతున్నారు. ప్రతి ఇంటికీ నెలకు రూ.10 వేల రూపాయల ఆదాయం ఉండేలా చూడాలన్నది చంద్రబాబు తాజా టార్గెట్.
శుక్రవారం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు అన్నీ ఇస్తున్నప్పుడు మరో పార్టీ అవసరం ఏముంటుందని చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి ప్రతిపక్షం అక్కర్లేదన్నారు. వచ్చే ఎన్నికలు మాత్రమే కాదని.. 2024లో కూడా తమదే అధికారమని సీఎం ధీమా వ్యక్తం చేశారు. దీన్నిబట్టి చంద్రబాబు చాలా కాన్ఫిడెంట్ గా తన పని తాను కానిచ్చేస్తున్నట్టు అర్థమవుతోంది. ప్రజలు అడిగినవన్నీ ఇస్తున్నప్పుడు మరో పార్టీ అవసరం ఏముందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.