తెలుగుదేశం పార్టీలో ఎంత స్వతంత్రం ఉంటుందో.. అంతకు నాలుగింతలు క్రమశిక్షణా ఉంటుంది. క్రమశిక్షణకు పెద్ద పీట వేసే ఏకైక పార్టీగా కూడా టీడీపీ గుర్తింపు పొందింది. అలాంటి పార్టీలో ఇటీవల కొందరు సీనియర్ నేతలు తోక ఝాడించారు. అయితే అప్పట్లో మౌనంగానే ఉన్న పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు అవకాశం చూసుకుని ఇప్పుడు తోకలు కట్ చేశారు. రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమైన ఈ విషయం సర్వత్రా సంచలనం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. నాలుగు నెలల కిందట రాష్ట్రంలో మంత్రి వర్గ విస్తరణ జరిగింది.
ఈ విస్తరణలో కొందరు పదవులు కోల్పోగా మరికొందరు అందిపుచ్చుకున్నారు. అయితే, పదవులు తమకు గ్యారెంటీగా వస్తాయని భావించిన నేతల ముఖాలను సైతం బాబు చూడకపోవడంతో వారంతా ఓ రేంజ్లో ఫైరయ్యారు. వీరిలో బుచ్చయ్య చౌదరి, విజయవాడ ఎమ్మెల్యే బొండా ఉమా, పదవిని పోగొట్టుకున్న బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి, పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్ర వంటి సీనియర్లు చాలా మంది ఉన్నారు. వీరంతా బహిరంగంగా విమర్శలు గుప్పించారు. అయితే, అప్పట్లో వీరిని పార్టీ అధినేత హోదాలో ఏమీ పన్నెత్తు మాటకూడా అనని చంద్రబాబు సమయం రాగానే పీకలు నొక్కేశారు.
నిన్న పార్టీలో ఏపీ, తెలంగాణ సహా జాతీయ స్తాయిలో కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీల్లో చాలా మందికి అవకాశం కల్పించారు. అయితే, విధేయతకే వీరతాడు అన్నట్టుగా బాబు వ్యవహరించారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరిని, బొజ్జల గోపాలకృష్ణా రెడ్డిని పక్కన పెట్టారు. వారికి కమిటీల్లో స్థానం కల్పించలేదు. ఇక బోండా ఉమా మహేశ్వరరావుకు కూడా పార్టీలో చోటు దక్కలేదు. గుంటూరు పార్టీ సమన్వయ కర్తగా నియమించారు. మరో సీనియర్ నేత కరణం బలరామ్ దీ అదే పరిస్థితి. సీనియర్ నేత గాలి ముద్దు కృష్ణమ నాయుడికీ ఏ పదవీ దక్కలేదు. పయ్యావుల కేశవ్ నూ పక్కన పెట్టేశారు. ఇక వైసీపీ, కాంగ్రెస్ ల నుంచి వచ్చిన నేతలకు పెద్దపీట వేశారు.
కాంగ్రెస్ నుంచి వచ్చిన డొక్కా మాణిక్యవరప్రసాద్, ఆనం రామనారాయణరెడ్డి, వైసీపీ నుంచి వచ్చిన కొత్తపల్లి సుబ్బరాయుడికి కమిటీల్లో స్థానం కల్పించారు. దీంతో సీనియర్ నేతలకు తానేంటో.. భవిష్యత్తులో తాను తీసుకోబోయే నిర్ణయాలేంటో చూపించారు చంద్రబాబు. నోరెత్తితే… నొక్కి పారేస్తా అన్న సిగ్నల్స్ ను చంద్రబాబు ఇచ్చారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏదేమైనా.. క్రమశిక్షణ అనే లక్ష్మణ రేఖను దాటిన నేతలకు బాగానే బుద్ధి చెప్పారు బాబు!! ఇక ప్రాధాన్యం కోల్పోయిన నేతలు ఇప్పుడు నీళ్లు నమలడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారట!