సాధారణంగా ప్రభుత్వాలు ఎక్కువ శాతం ప్రైవేట్ స్కూళ్లు మానండి..ప్రభుత్వ స్కూళ్లో చేరండి అనే నినాదాలు ఇస్తుంటాయి. కానీ అక్కడ మౌళిక వసతుల విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోరు. దీంతో ఎక్కువ శాతం మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లోనే చదువుతున్నారు. ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు మారాయి..కానీ సర్కారీ బడి పనితీరు మాత్రం మారలేదని ప్రజలు ఆరోపిస్తూనే ఉన్నారు. తాజాగా ఓ విద్యార్థిని కర్ణాటక సామాజిక సంక్షేమ శాఖ మంత్రి హెచ్.ఆంజనేయకు పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని బహిరంగ సవాల్ విసిరింది.
రాజకీయనాయకులు ఎవరైనా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్నారా? ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన వసతులు కల్పించి... అప్పుడు సందేశాలు ఇవ్వండి. అంతేకాదు మీ పిల్లలను ఆ పాఠశాలల్లో చేర్పించండి. అప్పుడు నేను ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్ మానేసి ప్రభుత్వ పాఠశాలలో చేరుతానని సవాల్ విసిరింది. పిట్ట కొంచెం కూత గనం అన్నట్లు..ప్రభుత్వ పాఠశాలల పనితీరు పై మంత్రిని ఎండగట్టింది.
చిత్రదుర్గ ప్రాంతంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఆంజనేయులు ప్రసంగించారు. అనంతరం వేదిక దిగి కిందకు వచ్చి అక్కడ ఉన్న విద్యార్థులతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్న నయన జోగి అనే విద్యార్థిని మంత్రిని పలు ప్రశ్నలు అడిగింది. ‘ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు వసతులు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రాజకీయ నాయకులు ఎవరైనా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్నారా? ముందు ప్రభుత్వ పాఠశాలల్లో సరైన వసతులు కల్పించి ఆ తర్వాత సందేశాలివ్వండి మంత్రికి షాక్ ఇచ్చింది. ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో నేను ప్రైవేటు పాఠశాలలో చేరాను... మీరు సౌకర్యాలు కల్పిస్తే నేనే కాదు.. నాతోపాటు మరో 30 మందిని కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తానని నిలదీసింది.
పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ పలుమార్లు సీఎంను కలిసినా, ఏమాత్రం ప్రయోజనం లేదని బాలిక అసహనం వ్యక్తం చేసింది. ఆ బాలిక చొరవ, ధైర్యం చూసి అక్కడున్నవారందరూ అభినందించారు. ఏకధాటిగా ఆ విద్యార్థిని వేస్తున్న ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో పాలుపోక సదరు మంత్రి తెల్లమొహం వేశారు.