గత కొన్ని రోజులుగా తమిళనాట రాజకీయం ఎన్నో మలుపులు తిరుగుతూ వస్తుంది. పన్నీర్ సెల్వం వర్సెస్ శశికళ మద్య జరిగిన రాజకీయ యుద్దంలో అనూహ్యంగా పళని స్వామి ఎంట్రీ ఇవ్వడం..సీఎం పదవి దక్కించుకోవడం జరిగింది. తనకు నమ్మిన బంటు అయిన పళని స్వామి ని సీఎం పీఠం పై కూర్చోబెట్టిన శశికళ తర్వాత తన ఆదిపత్యం కొనసాగించాలన్న ఆలోచనలో ఉండగా..పళని స్వామి ఆమెకు పెద్ద షాక్ ఇచ్చారు. శశికళ ప్రత్యర్థి అయిన పన్నీర్ సెల్వంతో చేయి కలిపి చిన్నమ్మను పార్టీ నుంచి బహిష్కరించారు.
ఇదిలా ఉంటే తమిళనాట కొత్త పార్టీ పుట్టుకొస్తుందని..స్టార్ హీరోలు రజినీకాంత్, విశ్వనటుడు కమల్ హాసన్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారని వార్తలు వచ్చాయి. ఇటీవల సినీనటుడు కమలహాసన్ ఇంటికి వచ్చిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆయనతో కాసేపు చర్చించి వెళ్లిన విషయం తెలిసిందే. దీనిపై కమలహాసన్ మరోసారి స్పందిస్తూ.. తాను కేజ్రీవాల్ని కలవలేదని, ఆయనే తన వద్దకు వచ్చారని చెప్పారు.
కేజ్రీవాల్ తన వద్దకు రావడం ఆయన మంచితనాన్ని సూచిస్తోందని చెప్పారు. ఇక రజనీకున్న మత విశ్వాసాలను బట్టి చూస్తే ఆయన కాషాయ పార్టీతో కలుస్తారని తనకు అనిపిస్తోందని కమల్ చెప్పారు. తాను ఆప్తో చేతులు కలపడం లేదని ఆయన స్పష్టం చేశారు. అంతే కాదు తానేమి కమ్యూనిస్టుని కాదన్నారు.
కొత్త సంవత్సరం వచ్చేలోపే తాను పెట్టే కొత్త పార్టీ వివరాలు ప్రకటిస్తానని చెప్పారు. తన పార్టీతో తమిళనాడుకు మంచి రోజులు వస్తాయని అన్నారు. పళని పాలనలో ప్రజలు కష్టాలు పడుతున్నారని, తన పార్టీ డీఎంకే, అన్నాడీఎంకేకు వ్యతిరేకంగానే ఉంటుందని, అవినీతిపై పోరాటం కొనసాగుతుందని కమల్ స్పష్టం చేశారు.