కడప జిల్లా అనగానే అది వై.ఎస్. కుటుంబానికి కంచుకోట అనే మాట వినిపిస్తింది. మాజీ మంత్రి బిజివేముల వీరారెడ్డి ఉన్నంతవరకూ కడప జిల్లాలో టీడీపీకి మంచి పట్టు ఉండేది. ఆ తర్వాత వై.ఎస్. కుటుంబం పట్టు పెంచుకుంది. అయితే ఇప్పుడు చంద్రబాబు మళ్లీ కడపపై కన్నేశారు. జగన్ ను ఏకాకిని చేసేందుకు పావులు కదుపుతున్నారు.
2014లో జరిగిన ఎన్నికల్లో కడప జిల్లాలో టీడీపీకి ఒక్క స్థానం మాత్రమే దక్కింది. ఆ తర్వాత పరిణామాలు మారిపోయాయి. పలువురు వైసీపీ నేతలు టీడీపీ గూటికి చేరారు. బద్వేలు ఎమ్మెల్యే పసుపు కండువా కప్పుకున్నారు. వై.ఎస్. కుటుంబానికి ఎంతో ఆప్తుడైన వరదరాజులు రెడ్డి సైకిలెక్కారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ బాబాయ్ వివేకానంద రెడ్డిని బీటెక్ రవి ఓడించారు.
2014 ఎన్నికల్లో ఒక్క స్థానం మాత్రమే గెలిచిన టీడీపీ.. ఎలాగైనా పట్టు పెంచుకోవాలనే కసితో పనిచేస్తోంది. చంద్రబాబు ప్రత్యేకంగా ఈ జిల్లాపై దృష్టి పెట్టారు. కుప్పం కంటే ముందు ప్రతిపక్షనేత సొంతూరు పులివెందులకు నీళ్లిస్తున్నట్టు ప్రకటించారు. అదే సమయంలో వైసీపీని బలపడకుండా వ్యూహరచన చేస్తున్నారు. వైసీపీ నుంచి నేతలు టీడీపీలో చేరకపోయినా పర్లేదు కానీ.. వైసీపీ బలపడే చర్యలను మాత్రం గట్టిగానే అడ్డుకుంటున్నారు.
మైదుకూరు నియోజకవర్గంలో మంచి పట్టున్న నేత డి.ఎల్.రవీంద్రా రెడ్డి. వై.ఎస్. కుటుంబంతో విభేదాలున్నాయి. వై.ఎస్. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డి.ఎల్. ను పెద్దగా పట్టించుకోలేదు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే డి.ఎల్. మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. ఆ తర్వాత టీడీపీతో సఖ్యతగా మెలిగినా పార్టీలో చేరలేదు. ఈ నేపథ్యంలో వైసీపీలో చేరుతారనే ఊహాగానాలు వినిపించాయి.
కానీ నంద్యాల, కాకినాడ ఎన్నికల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా నేతలందరూ వైసీపీ వైపు వెళ్లేందుకు కాస్త వెనుకంజ వేస్తున్నట్టు సమాచారం. తాజాగా డి.ఎల్.రవీంద్రా రెడ్డి కూడా వైసీపీలో చేరడం కంటే టీడీపీలో చేరడమే సేఫ్ అని భావించి.. ఆ దిశగా మంతనాలు సాగించినట్టు తెలుస్తోంది. తనకు ఎమ్మెల్యే సీటిస్తామని హామీ ఇస్తే పార్టీలో చేరుతారని టీడీపీకి ఆఫర్ ఇచ్చారు. బలమైన సామాజిక వర్గానికి చెందిన నేత కావడం, నియోజకవర్గంలో మంచి పట్టున్న లీడర్ కావడంతో చంద్రబాబు కూడా వెంటనే పచ్చజెండా ఊపేశారట. అక్కడ ఇన్ ఛార్జ్ గా ఉన్న పుట్టా సుధాకర్ యాదవ్ ను టీటీడీ ఛైర్మన్ గా పంపించి.. డి.ఎల్. ను అక్కడి నుంచి బరిలోకి దించేందుకు రంగం సిద్ధం చేసేశారు. అలా వైసీపీ వైపు డి.ఎల్. వెళ్లకుండా అడ్డుకోగలిగారు. త్వరలోనే మరింకొంత మంది కీలక నేతలు కూడా కడప జిల్లాలో టీడీపీలో చేరే అవకాశాలున్నట్టు సమాచారం.