తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రాలో అడుగుపెట్టబోతున్నారు. దసరా ఉత్సవాలకు ఇంద్రకీలాద్రికి వెళ్లి దుర్గమ్ము మొక్కు చెల్లించుకుంటారని అందరూ భావించారు. అయితే ఆ ప్రోగ్రామ్ వాయిదా పడింది. కానీ ఒకటో తేదీ కేసీఆర్ ఆంధ్రాలో అడుగుపెట్టబోతున్నారు. ఏ కార్యక్రమానికో తెలుసా..?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాయలసీమకు వెళ్తున్నారు. పరిటాల రవి – సునీత దంపతుల కుమారుడు పరిటాల శ్రీరామ్ వివాహానికి ఆయన హాజరవుతున్నారు. ఏపీ మంత్రిగా ఉన్న పరిటాల సునీత హైదరాబాద్ కు వెళ్లి శ్రీరామ్ వివాహానికి రావాలంటూ కేసీఆర్ ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. అప్పటికప్పుడే కేసీఆర్ ... తప్పకుండా పెళ్లికి వస్తానని మాటిచ్చారు.
శ్రీరామ్ వివాహానికి అనంతపురం జిల్లా వెంకటాపురానికి కేసీఆర్ వస్తున్నట్టు తెలంగాణ సీఎం కార్యాలయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సమాచారం అందించింది. ఈ మేరకు అనంతపురం జిల్లా అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. కేసీఆర్ పుట్టపర్తి వరకూ విమానంలో వెళ్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో వెంకటాపురం చేరుకుని నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. అనంతరం హైదరాబాద్ కు తిరుగు పయనమవుతారు.