వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా కొంతకాలంగా కనిపించడం లేదు. ఎందుకు కనిపించడం లేదనే మాట అటు మీడియాలోనే కాక, ఇటు ప్రజల్లో కూడా బలంగా వినిపిస్తోంది. అయితే ఆమెను కువైట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇంతకూ రోజా అరెస్టయ్యారా..?
నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా వారం పది రోజులుగా అస్సలు కనిపించడం లేదు. వాట్సాప్, ఫేస్ బుక్ లలో నిత్యం అప్ డేట్స్ పెడుతూ టచ్ లో ఉండే రోజా కొంతకాలంగా కిమ్మనకుండా ఉండిపోయారు. నంద్యాల ఉప ఎన్నికలో రోజా వ్యాఖ్యల వల్లే పార్టీ ఘోరంగా దెబ్బ తినిందని వార్తలొచ్చాయి. దీంతో.. రోజాకు జగన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారని .. అందుకే రోజా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని వార్తలొచ్చాయి. ఆమె దేశం వదిలి విదేశాల్లో విహార యాత్రకు వెళ్లారని తెలిసింది.
రోజా కూడా ఒక రోజు గోవాలో ఉన్నట్టు, ఇంకోరోజు దుబాయ్ లో ఉన్నట్టు, ఇంకోసారి శ్రీలంకలో, మరోసారి కువైట్ లో ఉన్నట్టు చెప్పుకొచ్చారు. దానికి సంబంధించిన కొన్ని పోటోలను కూడా విడుదల చేస్తూ వచ్చారు. అయితే రెండ్రోజులుగా రోజా నుంచి ఎలాంటి అప్ డేట్స్ లేవు. దీంతో ఆమె ఏమయ్యారని వాకబు చేస్తే.. ఆమెను కువైట్ లో అరెస్ట్ చేశారనే వార్త గుప్పుమంది.
అభిమానుల కోరిక మేరకు రోజా కువైట్ వెళ్లారు. అక్కడ ఓ హోటల్ లో సుమారు 2000 మందికి పైగా హాజరయ్యారు. దీనికి రోజా ముఖ్య అతిథి. అయితే ఈ సమావేశానికి అనుమతి లేదంటూ పోలీసులు సభను అడ్డుకున్నారు. ఈ సమయంలో అక్కడి కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో చాలా మందిని అదుపులోకి తీసుకున్నారు కువైట్ పోలీసులు. అదే సమయంలో రోజాను కూడా అరెస్ట్ చేశారని వార్తలొచ్చాయి.
అయితే తాను కువైట్ పోలీసుల అదుపులో ఉన్నాననే మాట అవాస్తవమని రోజా వివరణ ఇచ్చారు. తనపై దురుద్దేశంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ సమావేశంతో తనకేమీ సంబంధం లేదని, దానికి సంబంధించి ఏదైనా ఇబ్బంది ఉంటే అది నిర్వాహకులకు, పోలీసులకు మధ్య వ్యవహారమని స్పష్టం చేశారు. తనను అరెస్టు చేశారంటూ వస్తున్న వార్తలను నమ్మవద్దని సూచించారు.